‘వీరయ్య’కు అదొక్కటే మైనస్

మొత్తానికి సంక్రాంతి రేసులో ఉన్న చిత్రాల నుంచి చివరి ట్రైలర్ కూడా వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ నిన్ననే ట్రైలర్‌తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మీద ముందు నుంచి ఉన్న అంచనాలకు తగ్గట్లే ట్రైలర్ సాగింది. వింటేజ్ చిరంజీవిని చూపిస్తా అని ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి చెబుతూ వస్తున్న దర్శకుడు బాబీ.. అలాగే మెగాస్టార్‌ను ప్రెజెంట్ చేశాడు.

శంకర్ దాదా ఎంబీబీఎస్, రౌడీ అల్లుడు, ముఠా మేస్త్రి సహా పలు చిరు బ్లాక్‌బస్టర్ చిత్రాల ఛాయలు.. కామెడీ టైమింగ్, హీరో ఎలివేషన్లు ఇందులో కనిపించాయి. చిరు గెటప్ కూడా ఆయన పాత సినిమాలను గుర్తు చేసింది. ట్రైలర్ ఆసాంతం చిరు పాత్ర ఎంటర్టైనింగ్‌గా సాగింది. మాస్ రాజా రవితేజ క్యారెక్టర్ కూడా మాస్‌కు నచ్చేలా డిజైన్ చేసినట్లున్నాడు బాబీ. వీరి కలయికలో వచ్చిన లాస్ట్ సీన్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది. చిరు ఫేమస్ డైలాగ్‌ను రవితేజ.. రవితేజ మార్కు పంచ్ డైలాగ్‌ను చిరు చెప్పడం భలేగా అనిపించింది.

ఐతే ట్రైలర్లో అన్నీ ఓకే కానీ.. చిరు డైలాగ్ డెలివరీ మాత్రం కొంచెం తేడాగానే అనిపించింది. ఇది ఈ రోజు వచ్చిన సమస్య కాదు. పదేళ్ల విరామం తర్వాత చిరు చేసిన రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’లోనే ఆయన డైలాగ్ డెలివరీలో తేడా కనిపించింది. ఐయామ్ వెయిటింగ్.. పొగరు నా ఒంట్లో ఉంటుంది.. తరహా డైలాగులను చిరు ఫోర్స్‌గా చెప్పలేకపోయాడు. ఆ తర్వాత ‘సైరా’ మూవీలో సైతం ‘గెటౌట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్’ డైలాగ్‌ను చిరు పలికిన విధానం విమర్శలకు తావిచ్చింది. ఇటీవల ‘గాడ్ ఫాదర్’లో సైతం చిరు వాయిస్ పాత్రకు సరిగా కుదరలేదు.

వయసు ప్రభావం వల్ల చిరు ఫోర్స్‌తో డైలాగులు చెప్పలేకపోతున్న విషయం స్పష్టమవుతోంది. ఇది ప్రతి హీరోకూ ఎదురయ్యే సమస్యే. సీనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సమస్యను ఎదుర్కొన్నారు. బాలయ్య సైతం మధ్యలో వాయిస్‌తో ఇబ్బంది పడ్డాడు. కానీ తర్వాత కొంచెం సెట్ అయింది. కానీ చిరుకు మాత్రం వాయిస్ తేడా వచ్చేసినట్లే ఉంది. అది ఇక సెట్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ బలహీనతను నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో అధిగమించాల్సిందే.