తమన్ దేవిలో ఎవరిది పైచేయి

ఒకప్పటి తన మేజిక్ టచ్ కోల్పోయాడని ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్న దేవిశ్రీప్రసాద్ అభిమనులకు ఎట్టకేలకు ఊరట కలుగుతోంది. పెద్దగా అంచనాలు పెట్టుకోని వాల్తేరు వీరయ్య ఆల్బమ్ ఊహించిన దానికన్నా పెద్ద సక్సెస్ అందుకోవడంతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వీరసింహారెడ్డి రూపంలో తమన్ తో పెద్ద పోటీ ఎదురుకున్న దేవి ఒక్క బాస్ పార్టీ నుంచే 40 మిలియన్ల వ్యూస్ అందుకోగా అటుపక్క బాలయ్య నాలుగు పాటలకు కలిపి ఇన్ని వీక్షణలు రాలేదనే విషయాన్ని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. ఇవేవీ ఆఖరి లెక్కలు కాదు కాబట్టి రిలీజయ్యాక ఓ రెండు వారాలు ఆగితే అప్పుడు కంక్లూజన్ కి రావొచ్చు.

ఎలా చూసినా దేవికి పాటల టెస్ట్ లో పాస్ అయ్యాడు. చిరు శృతి హాసన్ ల డ్యూయెట్ మీద మిశ్రమ స్పందన వచ్చినా, పూనకాలు ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్ వినిపించినా ఓవరాల్ గా హిట్ ట్రాక్సే ఇచ్చాడు. నీకు అందమెక్కువ నాకు తొందరెక్కువ ఒకటే బ్యాలన్స్ ఉంది. తమన్ కూడా మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు కానీ ట్యూన్స్ మరింత ట్రెండీగా ఉండాలన్న ఫీడ్ బ్యాక్ లో అబద్ధమేమీ లేదు. ముఖ్యంగా జై బాలయ్య టైటిల్ ట్రాక్ ఎప్పుడో వచ్చిన ఒసేయ్ రాములమ్మని తలపించడం కొంచెం మైనస్ అయ్యింది. ఇందులో నుంచి కూడా ఇంకొక్క చివరి సాంగ్ ఈ వారంలోనే రాబోతోంది.

వీళ్లిద్దరికీ అసలైన సవాల్ 12, 13 తేదీల్లో రాబోతోంది. రెండు సినిమాలకు రీ రికార్డింగ్ చాలా కీలకం. మాస్ ఎంటర్ టైనర్స్ కాబట్టి ఈ స్కోర్ ఎంత బాగా ఎలివేట్ అయితే తెరమీద హీరోయిజం అంత బాగా పండుతుంది. తమన్ మీద ఈ పాయింట్ మీద నమ్మకం పెట్టుకోవచ్చు. ఎటొచ్చి దేవితోనే కొంచెం టెన్షన్. పుష్ప 1లో పాటలు అదరగొట్టిన దేవి బిజిఎం మాత్రం వావ్ అనిపించలేకపోయాడు. ఒకేసారి వారసుడు, వీరసింహారెడ్డి చేయాల్సిన ఒత్తిడి తమన్ మీద పడింది కానీ ఇటుపక్క దేవికి ఆ టెన్షన్ లేదు. మరి ఎవరు ఈ విషయంలో పై చేయి సాధిస్తారో నిర్ణయించేది బీజీయమే.