మహేష్‌‌తో సినిమా చేశాక.. ఈ పరిస్థితేంటి?

సూపర్ స్టార్‌ మహేష్ బాబుతో సినిమా చేయడం అంటే ఒక దర్శకుడికి పెద్ద అచీవ్మెంట్ అన్నట్లే. టాలీవుడ్ టాప్ మోస్ట్ స్టార్లలో ఒకడైన మహేష్‌తో సినిమా చేసే అవకాశం రావడం చిన్న విషయం కాదు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ల కెరీర్ మరో లెవెల్‌కు వెళ్లిపోతుంది. ఐతే అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని దర్శకుడు పరశురామ్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు.

‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా మిడ్ రేంజ్ స్టార్లు అతడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించగా.. వారిలోంచి నాగచైతన్యను ఎంచుకున్నాడు. వీరి కలయికలో సినిమాకు అడుగులు పడుతున్న సమయంలోనే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ నుంచి పిలుపు వచ్చింది పరశురామ్‌కు. చైతూ సినిమాను పక్కన పెట్టి మరీ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాడు పరశురామ్. కానీ వీరి కలయికలో వచ్చిన ‘సర్కారు వారి పాట’ అంచనాలను అందుకోలేకపోయింది.

‘సర్కారు వారి పాట’ హిట్ అయి ఉంటే.. ఇంకో టాప్ స్టార్‌తో పరశురామ్‌కు అవకాశం దక్కేదే. కానీ ఆ సినిమా ఆడకపోవడంతో ముందు అనుకున్న నాగచైతన్య సినిమా కూడా ముందుకు కదల్లేదు. కొన్ని నెలల పాటు ఈ సినిమా మీద పని చేసిన పరశురామ్.. చైతూను మెప్పించలేకపోవడంతో ప్రాజెక్టును డ్రాప్ చేయక తప్పట్లేదట. ఈ సినిమాను నిర్మించాల్సిన 14 రీల్స్ ప్లస్ వాళ్లు కూడా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఆ మధ్య ఒక వేడుకలో భాగంగా బాలయ్యతో సినిమా చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు పరశురామ్. కానీ అది మాటలకే పరిమితం అయింది. బాలయ్య కూడా అంత ఖాళీగా ఏమీ లేడు. మొత్తానికి ఇటు పెద్ద స్టార్లూ సెట్ కాక.. మిడ్ రేంజ్ హీరోలతోనూ సినిమా కుదరక.. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నాడు పరశురామ్. ‘సర్కారు వారి పాట’ రిలీజయ్యాక ఏడాది వ్యవధిలో అతడి కొత్త సినిమా ఏదీ సెట్స్ మీదికి వెళ్లే సంకేతాలు కనిపించడం లేదు. అంత పెద్ద స్టార్‌తో సినిమా చేశాక పరశురామ్‌కు ఈ పరిస్థితి రావడమేంటో?