జగన్‌కు ‘ధమాకా’ పంచ్

సినిమాల్లో పొలిటికల్ డైలాగులు పెట్టడం.. ప్రభుత్వం లేదా పార్టీల మీద పంచులు వేయడం కామనే. ఏదైనా పార్టీతో సంబంధం ఉన్న వాళ్లు సినిమా తీస్తే.. అవతలి పార్టీకి పంచులు విసురుతుంటారు. టాలీవుడ్లో నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. తెలుగుదేశం పార్టీతో ఆయన అనుబంధం తెలిసిందే కాబట్టి.. ప్రత్యర్థి పార్టీల మీద ఆయన పంచులు వేస్తుంటారు. ఐతే ఇలా రాజకీయాలకు సంబంధం లేని హీరోల సినిమాల్లో కూడా అనుకోకుండా కొన్నిసార్లు పొలిటికల్ పంచులు చూస్తుంటాం.

ఇప్పుడు ‘ధమాకా’ సినిమాలో ఏపీ సర్కారుకు బలంగా తాకేలా ఒక పంచ్ పడింది. కాకపోతే ఆ పంచ్ వేసింది హీరో రవితేజ కాదు. కమెడియన్ హైపర్ ఆది. ఇందులో రావు రమేష్ దగ్గర డ్రైవర్‌గా పని చేసే పాత్ర చేశాడు ఆది. పేరుకు డ్రైవరే కానీ.. తన ఓనర్ మీద పంచ్‌ల వర్షం కురిపిస్తుంటాడు ఆది. ఆ డ్రైవర్ వచ్చాక తనకు కలిసొచ్చిందనే కారణంతో అతనేమన్నా పడుతుంటాడు రావు రమేష్.

ఒక సీన్లో రావు రమేష్.. రవితేజను చంపించడానికి రౌడీలను పెడతాడు. వాళ్లకు ఫోన్ చేసి వాడ్ని వేశారా లేదా అని అడుగుతుంటాడు. దానికి ఆది స్పందిస్తూ… “బాబోయ్ అప్పట్నుంచి వేశారా లేదా వేశారా లేదా అంటున్నారు. ఒకటో తారీఖు వచ్చింది నా శాలరీ వేశారా లేదా” అంటూ పంచ్ విసురుతాడు. ఉద్దేశపూర్వకంగా ఈ డైలాగ్ రాశారా లేదా యాదృచ్ఛికమా అన్నది తెలియదు కానీ.. ఈ పంచ్ జగన్ సర్కారుకు తగిలేలా ఉంది.

ఏపీలో ఉద్యోగులకు జీతాలు బాగా ఆలస్యం అవుతుండడం.. నెల మధ్యలోకి వచ్చినా శాలరీ పడక తీవ్ర ఇబ్బందులు పడుతుండడం.. రోజు రోజుకూ పరిస్థితి దిగజారిపోతుండడం.. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పంచ్ జగన్ ప్రభుత్వానికే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా టాలీవుడ్లో వారసత్వంతో వచ్చిన హీరోలకు రవితేజ పంచ్ వేసినట్లుగా ఒక డైలాగ్ ఉంది. నా వెనుక ఎవరున్నారో తెలుసా అని విలన్ అంటే.. “నేను వెనుక ఎవరో ఉంటే పైకి వచ్చిన వాడిని కాదు. వెనుక ఎవరూ లేకపోయినా పైకి రావచ్చని నిరూపించిన వాడిని” అంటూ డైలాగ్ పేల్చడం విశేషం.