తప్పు ఎవరిదైనా శిక్ష అభిమానులకే

పండగ థియేటర్ల గొడవ విషయంలో ఎవరికి వారు మా తప్పేం లేదని చెప్పేసుకుంటున్నారు. దిల్ రాజు వారసుడు సంక్రాంతికి వస్తుందని నేనే ముందు చెప్పాను, మైత్రి వాళ్ళు ఒకేసారి రెండు పెద్ద హీరోల సినిమాలు తీసుకొస్తే దానికి నేనెలా బాధ్యుణ్ణి అవుతానని అంటున్నారు. మరోవైపు ఏడాదికి ఒకసారి వచ్చే కీలకమైన సీజన్ కాబట్టి చిరంజీవి బాలకృష్ణలు ఇద్దరూ అదే డేట్ కావాలని కోరుకోవడంలో తప్పేముందని మైత్రి వాళ్ళు భావిస్తున్నారు. అందరూ రైటే అందరూ రాంగే అన్నట్టుంది పరిస్థితి. మరోవైపు బిజినెస్ అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయి. పేర్లు, ఏరియాల వారిగా కౌంట్ బయటికి చెప్పడం లేదు కానీ గుట్టుగా లాక్ అవుతున్నాయి

ఈ పరిణామం వల్ల వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు అన్యాయం జరుగుతోందన్నది ఫ్యాన్స్ బాధ. ఉదాహరణకు వైజాగ్ లో ఆరు వారసుడుకి చిరు బాలయ్యలకు చెరో నాలుగు కేటాయించారనే వార్త ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. అసలు మార్కెట్ పెద్దగా లేని విజయ్ ని కేవలం తాను నిర్మించిన కారణంగా దిల్ రాజు ఇంత పెద్ద రిలీజ్ ఎలా ఇస్తారని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. తమిళనాడులో మాత్రం వరిసుకి ఎక్స్ ట్రా స్క్రీన్లు కావాలి ఇక్కడ మాత్రం ఇవ్వకూడదనే ధోరణి ఎంత వరకు కరెక్టని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ విషయం మీదే దిల్ రాజు ప్రెస్ మీట్ పెడితే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.

ఎవరికి ఎక్కువైనా తక్కువైనా చివరికి శిక్షగా ఫీలయ్యేది మాత్రం అభిమానులే. ఎందుకంటే ఇద్దరు హీరోల ఊర మాస్ బొమ్మలు మంచి రికార్డులతో హిట్లు కొట్టాలని ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో రెండు డబ్బింగ్ మూవీస్, రెండు చిన్న సినిమాలతో థియేటర్లు పంచుకోవాల్సి రావడం వల్ల చిరు బాలయ్య స్టామినాలకు తగ్గట్టు కలెక్షన్లు రావని బాధపడుతున్నారు. అదే జరిగితే వీళ్ళ మార్కెట్ గురించి సోషల్ మీడియాలో అనవసరంగా నెగటివ్ క్యాంపైన్ జరుగుతుంది. అది ఇంకో నరకం. టైం చూస్తేనేమో దగ్గర పడుతోంది. పాతిక రోజులు ఇట్టే కరిగిపోతాయి. ఇంకా ఏమేం జరగనుందో చూడాలి.