అవతార్-2.. తేలని పంచాయితీ

ఇంకో నాలుగు రోజుల సమయమే మిగిలింది ‘అవతార్-2’ రిలీజ్‌కు. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ థియేటర్లలోకి దిగబోతోంది. బహుశా ఈ చిత్రం మీద ఉన్న అంచనాలు.. ఇప్పటిదాకా వరల్డ్ సినిమా హిస్టరీలో మరే చిత్రం మీదా ఉండి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. అలాగే ఇంత భారీగా ప్రపంచవ్యాప్తంగా ఓ సినిమా రిలీజ్ కావడం కూడా ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు.
ఇండియాలో కూడా వచ్చే వారం బాక్సాఫీస్ మొత్తాన్ని ‘అవతార్-2’కే రాసిచ్చేశారు. ఏ భాషలోనూ పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ చేయట్లేదు. ఈ సినిమా చూసేందుకు కోట్లాది మంది ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆన్ లైన్లో టికెట్లు పెడితే వెంటనే బుక్ చేసి పడేద్దామనుకుంటున్నారు. కానీ విడుదలకు ఐదు రోజుల ముందు కూడా ఈ సినిమా టికెట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.

నిజానికి ఇండియా వైడ్ కొన్ని థియేటర్లు మూడు వారాల ముందే ‘అవతార్-2’ బుకింగ్స్ మొదలుపెట్టాయి. మల్టీప్లెక్సుల్లో ఇలా పెట్టిన టికెట్లు అలా అయిపోయాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లోనే కాక చాలా చోట్ల ‘అవతార్-2’ టికెట్లు పూర్తిగా అందుబాటులోకి రాకపోవడానికి సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు, ఎగ్జిబిటర్లకు మధ్య ఆదాయ పంపకాల్లో వాటాలు కుదరకపోవడమే కారణమని తెలుస్తోంది.

డిస్నీ సంస్థ లోకల్ పార్ట్‌నర్స్‌తో కలిసి ఇండియాలో సినిమాను రిలీజ్ చేస్తుండగా.. థియేటర్ రెవెన్యూ నుంచి సింగిల్ స్క్రీన్లు 30 శాతం, మల్టీప్లెక్సులు 40 శాతం మేర డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తామని అంటున్నట్లు సమాచారం. లోకల్ సినిమాలకు అయితే 55 నుంచి 60 శాతం ఆదాయం డిస్ట్రిబ్యూటర్లకు వెళ్తుంది కానీ.. హాలీవుడ్ సినిమాలకు రేషియో తగ్గడం మామూలే. కానీ డిస్నీ సంస్థ ఇంకా ఎక్కువ షేర్ ఆశిస్తోంది. మన సినిమాలను విదేశాల్లో రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్లకు ఈ మాత్రం ఆదాయం కూడా రాదు. ఈ వాటాల పంచాయి కొన్ని రోజుల నుంచి నడుస్తోంది. ఏకాభిప్రాయం కుదరట్లేదు. అందుకే మెజారిటీ థియేటర్లలో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ పంచాయితీ తెగి.. బుకింగ్స్ మొదలు పెడతారని భావిస్తున్నారు.