అయినా పూరి ఆపలేదు


పూరి జగన్నాథ్‌కు ఈ మధ్య ఫిలిం మేకర్‌గా కంటే ఫిలాసఫర్‌గా ఎక్కువ పేరు సంపాదించారు. తన సినిమాల్లో యూత్‌కు సూటిగా తాకే ఫిలసాఫికల్ డైలాగ్స్‌తో ఆయన ఎప్పట్నుంచో తన ప్రత్యేకతను చాటుకుంటూనే వస్తున్నారు. ఐతే కొన్నేళ్ల కిందట్నుంచి మొదలైన పాడ్ కాస్ట్ ట్రెడిషన్‌ను అందిపుచ్చుకుని పూరి మ్యూజింగ్స్ పేరుతో వివిధ అంశాలపై సూటిగా సుత్తి లేకుండా తన అభిప్రాయాలను చెబుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కేవలం ఈ మ్యూజింగ్స్ వరకే పూరికి ఒక అభిమాన వర్గం తయారైంది.

ఆ పాడ్ కాస్ట్ ‌లను వింటూ.. ఇంత విషయం ఉన్న పూరి ఆ కంటెంట్‌ను తన సినిమాల్లో ఎందుకు చూపించట్లేదని ఆశ్చర్యపోతున్నారు ఆయన ఫ్యాన్స్. ఐతే కొన్ని టాపిక్స్ మీద ఆయన షార్ప్ ఒపీనియన్స్ చూసి.. ‘లైగర్’ మూవీలో అదే పంచ్ చూపిస్తారని ఆశపడ్డ అభిమానులూ ఉన్నారు. కానీ వాళ్లందరికీ నిరాశ తప్పలేదు.

‘లైగర్’ సినిమా పూరి కెరీర్లోనే అత్యంత పేలవమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా చూసి ఇక పూరి సినిమాలు ఆపేస్తే బెటర్ అన్నారు చాలామంది. మరీ ఇంత ఔట్ డేటెడ్ సినిమాను ఈ రోజుల్లో పూరి ఎలా తీశాడు.. ఇది ఆడుతుందని ఎలా నమ్మాడు అని ాశ్చర్యపోయారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత పూరి మీద మామూలు ట్రోలింగ్ జరగలేదు. ఆ ట్రోల్స్‌లో పాడ్ కాస్ట్ టాపిక్ కూడా వచ్చింది. పూరి మ్యూజింగ్స్‌లో మాటలు చెప్పడం తప్ప.. సినిమాలు తీయడంలో పూరి తన ప్రతిభను చూపించట్లేదంటూ కౌంటర్లు వేశారు.

ఈ సంగతిలా ఉంటే.. ‘లైగర్’ నష్టాలకు సంబంధించి బయ్యర్లతో గొడవ, ఈ సినిమా పెట్టుబడులపై ఈడీ విచారణ.. ఈ పరిణామాలంతా చూశాక పూరి ఇక ‘మ్యూజింగ్స్’ జోలికి వెళ్లే సాహసం చేయడని.. ఎవరికీ క్లాసులు పీకడని అనుకున్నారు. కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి పూరి మళ్లీ ‘మ్యూజింగ్స్’ను మొదలుపెట్టడం విశేషం. ఈసారి ఆయన ‘తడ్కా’ అనే టాపిక్ మీద మాట్లాడారు. తడ్కా అంటే మసాలా కలపడం అని.. ఈ పని ప్రతి మనిషీ చేస్తారని అంటూ పూరి తనదైన శైలిలో మనుషుల మనోభావాలను విశ్లేషించే ప్రయత్నం చేశారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ డీలా పడిపోకుండా వెంటనే పైకి లేచి సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంటాడు పూరి. అందుకే పూరిని దర్శకుడిగానే కాక వ్యక్తిగానూ చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈసారి తన ‘మ్యూజింగ్స్’ టచ్‌ను సినిమాలోనూ చూపిస్తూ ఆయన బౌన్స్ బ్యాక్ అవ్వాలన్నది అభిమానుల ఆకాంక్ష.