చిన్న సినిమాకు అంత రిస్క్ ఎందుకు

ఒకపక్క చిరంజీవి బాలకృష్ణ సినిమాలకే తగినన్ని థియేటర్లు దొరుకుతాయా లేదాని ఫ్యాన్స్ టెన్షన్ పడుతుంటే విజయ్ వారసుడుకి తోడుగా అజిత్ మూవీ కూడా నేను సైతం అంటూ ఫిక్స్ కావడం ఎగ్జిబిటర్లను ఖంగారు పెడుతోంది. ముఖ్యంగా నాలుగైదు హాళ్లు మాత్రమే ఉండే కొన్ని బిసి సెంటర్లలో ఇదో పెద్ద తలనెప్పిగా మారుతుంది. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు వచ్చే ఓవర్ ఫ్లోస్ ని మిగిలినవి క్యాష్ చేసుకున్నా మళ్ళీ ఆ ఇద్దరి కోసం ప్రేక్షకులు టికెట్లు కొనడం టాక్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత సంక్రాంతి సీజనైనా ఆ హడావిడి సందడి మహా అయితే వారం రోజులకు మించి ఉండదు. ఆలోగానే రాబట్టుకోవాలి.

ఇప్పుడివి చాలవన్నట్టు సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయంని అదే సమయంలో విడుదల చేయాలని నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్ణయించుకుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కొత్త దర్శకుడు అనిల్ తో డీసెంట్ బడ్జెట్ తో చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. అసలు షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందో మీడియాకు తెలియనంత గుట్టుగా పూర్తి చేస్తున్నారు ఇప్పుడు ఉన్నట్టుండి మేమూ సంక్రాంతికే వస్తామంటే సర్దుబాటు చేయడం అంత ఈజీగా ఉండదు. యువికి డిస్ట్రిబ్యూషన్ లో పట్టు, వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే మల్టీప్లెక్సులు ఉన్నంత మాత్రాన ఇంత రిస్క్ చేయాలా అనేది ప్రశ్న.

ఇదే తరహా ఓవర్ కాన్ఫిడెన్స్ తో దసరా బరిలో గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ లతో పాటు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యంని దించితే ఏం జరిగిందో అందరికీ గుర్తే. పాజిటివ్ టాక్ వచ్చిన చిత్రం అనవసరంగా కిల్ అయిపోయింది. దెబ్బకు కేవలం ఇరవై రోజుల గ్యాప్ తో ఓటిటికి ఇచ్చేశారు. అసలే సంతోష్ శోభన్ కి మార్కెట్ లేదు. కనీస ఓపెనింగ్స్ కూడా తేలేడని లేటెస్ట్ డిజాస్టర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఋజువు చేసింది. అదిరిపోయే కంటెంట్ ఉంటే తప్ప ఇతని కోసం జనం థియేటర్లకు రారు. అలాంటప్పుడు చిరు బాలయ్య విజయ్ అజిత్ ల మధ్య నలిగిపోకుండా ఉండగలడా. అఫీషియల్ చేయలేదు కానీ టాక్ అయితే జోరుగా ఉంది.