రవితేజ బ్రాండు పని చేయలా..

మాస్ రాజా రవితేజ తెలుగులో తాను నటించిన కొన్ని చిత్రాల్లో నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. అవి కాక అతను ఈ మధ్య తమిళ సినిమాలను సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎలా కుదిరిందో ఏమో కానీ.. తమిళ హీరో విష్ణు విశాల్‌తో అతడికి మంచి స్నేహం కుదిరి ఆల్రెడీ అతను నటించిన ‘ఎఫ్ఐఆర్’ అనే చిత్రాన్ని తెలుగులో ప్రెజెంట్ చేశాడు.

అది మంచి సినిమానే అయినా.. ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే వెళ్లిపోయింది. అయినా నిరాశ చెందకుండా విష్ణు విశాల్ కొత్త సినిమాలోనూ రవితేజ భాగస్వామి అయ్యాడు. విష్ణు, ఐశ్వర్యా లక్ష్మి జంటగా చెల్లా అయ్యావు అనే యువ దర్శకుడు రూపొందించిన ‘మట్టి కుస్తీ’ చిత్రాన్ని తెలుగులో రవితేజ సమర్పించాడు. ఈ చిత్రానికి నిర్మాత విష్ణునే. ఈ సినిమాకు టాక్ అయితే బాగుంది కానీ.. తెలుగు ప్రేక్షకులు దీన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

అజయ్, శత్రు లాంటి తెలుగు నటులు కీలక పాత్రలు పోషించినా.. డబ్బింగ్ అంతా కూడా బాగానే చేసినా.. అన్నింటికీ మించి టాక్ బాగున్నా ‘మట్టి కుస్తీ’ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. తొలి రోజు మార్నింగ్ షో నుంచి ఏ దశలోనూ సినిమా పైకి లేవలేదు. మన వాళ్ల ఫోకస్ మొత్తం ‘హిట్-2’ మీదే ఉండి అందరూ దాని కోసమే ఎగబడుతున్నారు. ‘మట్టి కుస్తీ’ అనే పేరు, ప్రోమోలు చూసి ఇదేదో ‘దంగల్’ టైపు కుస్తీ సినిమా అనుకున్నారు కానీ.. నిజానికి ఇది పక్కా ఫ్యామిలీ మూవీ.

కుస్తీ అనేది సబ్ ప్లాట్ మాత్రమే. రవితేజకు ఈ కథ బాగా నచ్చేసి తనే తెలుగులో చేయాలని కూడా అనుకున్నాడట. కానీ విష్ణు ఒప్పుకోకుండా దీన్ని బహుభాషా చిత్రంంగా చేసి తెలుగులో రిలీజ్ చేశాడు. కానీ ఎంత కష్టపడ్డా అతడికి ఈ సారి కూడా తెలుగులో గుర్తింపు దక్కలేదు. రవితేజ బ్రాండు కూడా ఈ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడనట్లే కనిపిస్తోంది.