కొత్త డైరెక్టర్‌తో ఎందుకు? తేజు సమాధానం

వరుసగా అరడజను ఫ్లాపుల తర్వాత ‘చిత్రలహరి’ సినిమాతో కొంచెం ఉపశమనం పొందాడు సాయిధరమ్ తేజ్. ఆ తర్వాత ‘సోలో బ్రతుకే సో బెటర్’ కూడా ఓ మోస్తరుగా ఆడింది. ‘ప్రతి రోజూ పండగే’ అయితే అనుకోకుండా బ్లాక్‌బస్టర్ అయింది. కానీ తేజు చివరి చిత్రం ‘రిపబ్లిక్’ మాత్రం డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. అదే సమయంలో తేజుకు యాక్సిడెంట్ కావడం, కొత్త సినిమా మొదలుపెట్టడంలో ఆలస్యం జరగడంతో లైమ్ లైట్లో లేకుండా పోయాడు.

ఐతే కొన్ని నెలల కిందటే సుకుమార్ శిష్యుడైన కార్తీక్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమాను మొదలుపెట్టడం తెలిసిందే. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకో కొత్త దర్శకుడితో తేజు ఓ చిత్రాన్ని ఆరంభించాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్‌’తో పాటు ఇప్పటికే సెట్స్ మీద ఉన్న తేజు చిత్రాన్ని నిర్మించిన సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాదే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుండడం విశేషం.

శుక్రవారమే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రంతో జయంత్ పానుగంటి అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవం గురించి తేజు పెట్టిన ట్విట్టర్ పోస్టుపై స్పందిస్తూ ఒక నెటిజన్.. కాస్త పేరున్న దర్శకులతో సినిమాలు చేయమని తేజును ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనికి తేజు బదులిస్తూ ‘‘ఒకప్పుడు నేను కూడా కొత్తే కదా. ఈ దర్శకుడి పేరు జయంత్. ఈ పేరును గుర్తుంచుకోండి’’ అని ట్వీట్ చేశాడు.

కెరీర్ ఆరంభంలో ‘రేయ్’ సినిమాతో తేజు పడ్డ ఇబ్బంది అందరికీ తెలిసిందే. ఆ సినిమా విడుదలకే నోచుకోని స్థితిలో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అతడికి లైఫ్ ఇచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త దర్శకులకు అనుభవం లేదని ఆలోచించకుండా టాలెంట్‌ను నమ్మి వారితో సినిమా చేస్తున్నానని తేజు చెప్పకనే చెప్పాడు. మరి తేజు నమ్మకాన్ని ఇప్పుడు అతడితో సినిమాలు చేస్తున్న ఇద్దరు కొత్త దర్శకులు ఏమేర నిలబెడతారో చూడాలి.