స్వంత ఇంట్లో వారసుడి కష్టాలు

తెలుగులో థియేటర్లను ఎక్కువగా బ్లాక్ చేసుకుంటోందన్న వివాదాన్ని ఎదురుకుంటున్న విజయ్ వారసుడు తమిళ ఒరిజినల్ వెర్షన్ వరిసు స్వంత రాష్ట్రంలో మాత్రం ఇబ్బందులు పడుతున్నట్టు చెన్నై టాక్. అజిత్ తునివుని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి స్టాలిన్ వారసుడు ఉదయనిధి డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో అధిక శాతం స్క్రీన్లు దానికే వచ్చేలా ప్లాన్ చేస్తున్నారనే వస్తున్న వార్త పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కేటాయింపులకు సంబంధించిన వివరాలు అధికారికంగా బయటికి రాకపోయినా ఫైనల్ లిస్టు చూశాక అభిమానులు షాక్ అవుతారని పంపిణీదారులు ఆఫ్ ది రికార్డు మాట్లాడుకుంటున్నారు.

అజిత్ క్రేజ్ విజయ్ తో సమానంగా లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న అవకాశాన్ని తునివు నిర్మాతలు చాలా తెలివిగా వాడుకుంటున్నారు. ఈ ఇద్దరూ సంక్రాంతి బరిలో పోటీ పడటం ఇదేం కొత్త కాదు. చాలా సార్లు క్లాష్ అయ్యారు. కానీ ఈ సారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. వారసుడు నిర్మాత దిల్ రాజుకి ఏపీ తెలంగాణలో బలమైన నెట్ వర్క్ ఉన్నప్పటికీ కోలీవుడ్ లో ఆయనది పైచేయి కాలేదు. థర్డ్ పార్టీ సహాయం తీసుకోవాల్సిందే. కానీ తునివును ఓవర్ టేక్ చేసేలా ఎత్తుగడలు వేసేంత ప్లానింగ్ లేకపోవడంతో ఈ సమస్య వస్తోందట. వరిసుని కూడా ఉదయనిధి తీసుకున్నారని వినికిడి.

మొత్తానికి సీన్ అటు ఇటు రివర్స్ అయ్యేలా ఉంది. విజయ్ కానీ అజిత్ కానీ ఈ వ్యవహారాల గురించి ఎక్కడా మాట్లాడ్డం లేదు. షూటింగులు చివరి దశలో ఉండటం వల్ల ఇంకా మీడియా ముందుకు రాలేదు. ఒకవేళ ఇక్కడ చెప్పినట్టే జరిగితే మాత్రం తమిళనాడు కంటే ఏపి తెలంగాణలో వారసుడుకి బెటర్ రిలీజ్ దక్కొచ్చు. ఇంకా వీటికి సంబంధించిన టీజర్లు వదల్లేదు. అవి వచ్చాక అంచనాల విషయంలో హెచ్చుతగ్గులు మారిపోయినా ఆశ్చర్యం లేదు. వలిమై టైంలో ఉపయోగించిన స్ట్రాటజీనే తునివుకు వాడబోతున్నారు నిర్మాత బోనీ కపూర్. చూడాలి మరి ఏం జరగనుందో .