ఎటు చూసినా కెజిఎఫ్‌ బ్యాచ్ కనిపిస్తోందే

ఒక సినిమా అతిపెద్ద బ్లాక్‌బస్ట‌ర్ అయ్యిందంటే మాత్రం.. ఆ సినిమాలో పనిచేసినోళ్లకి, కనిపించినోళ్లకి వెంటనే భారీ బ్రేక్ వచ్చేస్తుంది. బాహుబలి తరువాత అప్పటివరకు తెలుగులో చాలా వెనుకబడిన ప్రభాస్.. ఒక్కసారిగా ఇండియాలోనే నెం.1 స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయాడు. అప్పటివరకు ఖాళీగా ఉన్న తమన్నా ఇప్పటికీ బిజీగానే ఉంటోంది. ఇకపోతే ఇప్పుడు కెజిఎఫ్ సినిమాకు పనిచేసిన బ్యాచ్ పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది.

నిజానికి కెజిఎఫ్ ఎంత పెద్ద సంచలనం అంటే.. ఇప్పటివరకు అటు యష్‌ కాని ఇటు ప్రశాంత్ నీల్ కాని.. ఇంకా తదుపరి చిత్రాలతో రానేలేదు. కాకపోతే వారి రేంజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. అయితే ఇటీవల కెజిఎఫ్‌ సినిమాలో ఆండ్రూస్ పాత్రలో కనిపించిన బిఎస్ అవినాష్‌.. ఇప్పుడు ఇండియా అంతటా బిజీ అయిపోయాడు. కెజిఎఫ్ 2 లో మనోడి విలన్ రోల్ బాగా పండటంతో.. ఇప్పుడు సంక్రాంతికి రాబోయే వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి.. రెండింటిలోనూ మనోడు ఒక ముఖ్యమైన విలన్ భూమిక పోషిస్తున్నాడు.

మరో ప్రక్కన.. బాలీవుడ్‌లో రాబోయే ప్రతీ సినిమాకూ ఇప్పుడు కెజిఎఫ్‌ కంపోజర్ రవి బస్రూర్‌నే సంగీత దర్శకుడిగా కావాలంటూ ఎప్రోచ్ అవుతున్నారట. నిన్న రిలీజైన అజయ్ దేవగన్ బోళా సినిమా టీజర్‌కు కూడా ఈయనే నేపథ్య సంగీతం అందించాడు. సల్మాన్‌ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాకు కూడా ఈయనే మ్యూజిక్ కొడుతున్నాడు. తెలుగులో సాయిధరమ్ తేజ్ సినిమాకు మనోడ్ని ఓకె చేశారు కాని, హిందీలో మాత్రం పెద్ద పెద్ద స్టార్లే రవి వెనుక పడుతున్నారులే.

మొత్తానికి ఎటు చూసినా కూడా కెజిఎఫ్‌ బ్యాచ్ ఫుల్ బిజీ అయిపోయింది.. వారే అన్ని సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. కాకపోతే హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాత్రం.. నాకు 4-5 కోట్ల భారీ పారితోషకం కావాలంటూ వచ్చిన ఆఫర్లన్నీ పోగొట్టుకుంటోందట. విక్రమ్ కోబ్రా సినిమాలో భారీగా తీసుకుని నటించింది కాని, ఆ సినిమాతో పాటు ఆమె రోల్ కూడా వర్కవుట్ కాకపోవడంతో.. ఇప్పుడు శ్రీనిధి డిమాండ్స్‌కు ప్రొడ్యూసర్లు ఒప్పుకోవట్లేదు.