ఇంకో ఫ్లాప్ డైరెక్టర్‌కి శర్వా ఛాన్స్

టాలీవుడ్లో ట్రాక్ రికార్డు చూడకుండా దర్శకులతో సినిమాలు చేసే హీరోల్లో శర్వానంద్ ఒకడు. తన కెరీర్ ప్రమాదంలో ఉన్న స్థితిలో కూడా అతను ఫ్లాప్ దర్శకులకు, డెబ్యూ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చాడు. ‘నేను శైలజ’ తర్వాత సరైన విజయాన్ని అందుకోని కిషోర్ తిరుమలతో అతను చేసిన ‘ఆడవాళ్ళు నీకు జోహార్లు’ తీవ్రంగా నిరాశ పరిచింది. దీని తర్వాత శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడిని నమ్మి ‘ఒకే ఒక జీవితం’ సినిమా చేస్తే.. అది శర్వాకు అత్యావశ్యక విజయాన్ని అందించింది. ఈ సినిమా రిలీజ్ కాకముందే శర్వా ఒక ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమాను లైన్లో పెట్టాడు.

‘రౌడీ ఫెలో’ మూవీతో పర్వాలేదనిపించి ఆ తర్వాత ‘ఛల్ మోహన్ రంగ’తో షాక్ తిన్న కృష్ణచైతన్యతో శర్వా ఓ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ మధ్యే చిత్రీకరణ దశలోకి వెళ్లగా.. శర్వా కొత్తగా మరో సినిమాను ఒప్పుకున్నట్లు సమాచారం.

యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో శర్వానంద్ ఓ సినిమా చేయబోతున్నాడన్నది తాజా కబురు. ‘భలే మంచి రోజు’తో ప్రామిసింగ్ డైరెక్టర్‌లా కనిపించిన శ్రీరామ్.. తర్వాత వరుసగా ఫ్లాపులు ఇచ్చాడు. శమంతకమణి, దేవదాసు, హీరో సినిమాలు అతణ్ని నిరాశకు గురి చేశాయి. అంతకుముందు రెండు చిత్రాలైనా ఓకే కానీ.. చివరగా శ్రీరామ్ తీసిన ‘హీరో’ ప్రేక్షకులకు ఏమాత్రం రుచించలేదు. దీని తర్వాత అతడికి ఇంకో ఛాన్స్ కష్టమనుకుంటున్న సమయంలో శర్వా అతడితో సినిమాను ఓకే చేశాడట. వీరి కలయికలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకోబోతోందట. ఒక యంగ్ ప్రొడ్యూసర్ దీన్ని నిర్మిస్తాడట.

ఈ చిత్రంలో శర్వా సరసన ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి నటించనున్నట్లు సమాచారం. వీరి కలయికలో రానున్న తొలి చిత్రమిదే. స్వల్ప వ్యవధిలో వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదుర్కొన్న కృతికి శర్వా లాంటి పేరున్న హీరో పక్కన ఛాన్స్ రావడం విశేషమే.