స్పెషల్ షోల మీద ఆసక్తి చంపేశాడు

నట్టి కుమార్ అని టాలీవుడ్ ‘సీనియర్’ ప్రొడ్యూసర్. ఇండస్ట్రీ సమస్యల మీద మాట్లాడుతూ, ఇండస్ట్రీ పెద్దల్ని టార్గెట్ చేస్తూ ఉండే ఈ నిర్మాత చుట్టూ వివాదాలు తక్కువేమీ కాదు. గతంలో ‘లవ్ ఇన్ ఖజుర’ అనే బి-గ్రేడ్ మసాలా మూవీ తీసిన నట్టి కుమార్.. ఆ తర్వాత చాలా సినిమాలే నిర్మించాడు. కానీ వాటిలో చాలా వరకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయినవే. చాలా సినిమాలు అసలు విడుదలకే నోచుకోలేదు కూడా.

ఇప్పుడాయన దృష్టి ‘స్పెషల్ షో’ల మీద పడింది. స్టార్ హీరోల పుట్టిన రోజులు, ఇంకేవైనా స్పెషల్ అకేషన్స్‌ను పురస్కరించుకుని వారి కెరీర్లలో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తుండడం తెలిసిందే. పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి సినిమాలకు మంచి రెస్పాన్స్ రావడం చూసి నట్టి కుమార్ దృష్టి వీటి మీద పడింది.

ప్రభాస్ పుట్టిన రోజును పురస్కరించుకుని గత నెలలో రెబల్, వర్షం చిత్రాలను రిలీజ్ చేశాడు నట్టి కుమార్. ఈ నెలలో అకేషన్ ఏమీ లేకపోయినా ఎన్టీఆర్ సినిమా ‘బాద్‌షా’ను రిలీజ్ చేశాడు. అభిమానులతో ఏమాత్రం కోఆర్డినేట్ చేసుకోకుండా తన పాటికి తాను ఈ షోలు వేసుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాలను పెద్దగా ఓన్ చేసుకోలేదు. అభిమానులు ఈ సినిమాలను ఓన్ చేసుకుని కలిసి కట్టుగా సాగితేనే పబ్లిసిటీ వస్తుంది. టికెట్లు తెగుతాయి. ఫుల్స్ పడతాయి. చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తాయి. నట్టి కుమార్ ఫ్యాన్స్‌ను పట్టించుకోకుండా షోలు వేసుకున్నాడు. ఈ చిత్రాల్లో వేటికీ ఆశించిన స్పందన రాలేదు.

ఇప్పుడేమో ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలకు ఫుల్స్ పడలేదని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారు. ఇది ఆ హీరోల అభిమానులకు ఇబ్బందిగా తయారైంది. మొత్తానికి ప్లానింగ్, కోఆర్డినేషన్ లేకుండా ఈ సినిమాలను రిలీజ్ చేసి స్పెషల్ షోల మీద ఉన్న ఆసక్తినే చంపేశాడంటూ నట్టి కుమార్ మీద హీరోల ఫ్యాన్స్ మండిపడుతున్నారు.