టాలీవుడ్‌కు లింగుస్వామి వార్నింగ్

దశాబ్దాల నుంచి తమిళ అనువాదాలను తెలుగులో ఎంత బాగా ఆదరిస్తున్నారో తెలిసిందే. రజినీకాంత్, కమల్ హాసన్ సహా ఎందరో తమిళ హీరోలను మన వాళ్లు నెత్తిన పెట్టుకున్నారు. తెలుగులో పెద్ద సినిమాలకు దీటుగా ఎన్నో తమిళ చిత్రాలను ఆదరించారు. అలాంటిది ఈ మధ్య తెలుగు ప్రేక్షకుల మీద, ఇండస్ట్రీ మీద తమిళులు దాడికి దిగుతుండడం విడ్డూరం.

‘పొన్నియన్ సెల్వన్’ను తెలుగులో ఆదరించలేదని, ఆ సినిమాను విమర్శిస్తున్నారని తమిళ క్రిటిక్స్, అక్కడి జనాలు విమర్శలు గుప్పించడం..‘బాహుబలి’ సహా మన సినిమాలను డీగ్రేడ్ చేయడం.. ఇక ముందు తెలుగు చిత్రాలను ఆదరించం అన్నట్లుగా వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే. ఇప్పుడు దర్శకుడు, నిర్మాత లింగుస్వామి.. విజయ్ సినిమా ‘వారసుడు’కు తెలుగులో థియేటర్లు కేటాయించే విషయమై తలెత్తిన సమస్యపై మాట్లాడుతూ.. టాలీవుడ్‌కు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

వచ్చే సంక్రాంతికి చిరంజీవి, బాలయ్యల సినిమాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’లతో సమానంగా నైజాం ఏరియాలో దిల్ రాజు ‘వారసుడు’ సినిమాకు థియేటర్లు అట్టిపెడుతుండడం కొన్ని రోజులుగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఐతే పండుగల సమయంలో తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, అనువాద చిత్రాలకు ఎలా థియేటర్లు ఇస్తామని ‘పేట’ సినిమా విషయంలో తలెత్తిన వివాదంపై మాట్లాడుతూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు అందరూ ప్రస్తావిస్తున్నారు. దీనిపై నిర్మాతల మండలి సైతం స్పందించి.. దిల్ రాజు గతంలో అన్న మాట ప్రకారం తెలుగు సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం దక్కేలా చూడాలని డిమాండ్ చేసింది.

ఐతే ఇక్కడ ఈ వివాదం నడుస్తుండగా.. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ లింగుస్వామి టాలీవుడ్‌కు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. విజయ్ లాంటి సూపర్ స్టార్ తెలుగులో పెద్ద నిర్మాతకు డేట్లు ఇచ్చి సినిమా చేస్తున్నాడని.. కాబట్టి వారసుడు సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇవ్వలని, ఒకవేళ ఈ సినిమాకు చాలినన్ని థియేటర్లు ఇవ్వకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయని.. వ్యవహారం ‘వారసుడు’కు ముందు ‘వారసుడు’కు తర్వాత అన్నట్లు తయారవుతుందని లింగుస్వామి పేర్కొన్నాడు. దీన్ని బట్టి ‘వారసుడు’ సినిమాకు చాలినన్ని థియేటర్లు ఇవ్వకపోతే.. రేప్పొద్దున తమిళంలో రిలీజయ్యే తెలుగు సినిమాలకు ఇబ్బందులు సృష్టిస్తామని లింగుస్వామి పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లే కనిపిస్తోంది.