రాజమౌళే చెప్పినా నమ్మబుద్ధి కావట్లా

Rajamouli
Rajamouli

‘బాహుబలి’ తర్వాత తనపై పెరిగిన భారీ అంచనాలను అందుకుంటూ ‘ఆర్ఆర్ఆర్’తో మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు రాజమౌళి. ఈ సినిమా ఇండియాలో కంటే కూడా అమెరికా లాంటి దేశాల్లో అద్భుత స్పందన తెచ్చుకుంది. అమెరికన్స్‌తో పాటు చాలా దేశాల ప్రేక్షకులు ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. ఈ సినిమాను అంతర్జాతీయంగా మరిన్ని దేశాలకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు జక్కన్న.

ఆల్రెడీ జపాన్‌తో సినిమాను బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు. అక్కడ అద్భుత స్పందన వస్తోంది. దీంతో పాటు వివిధ దేశాల్లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్స్‌లో సినిమాను ప్రదర్శించే ప్రయత్నాల్లో ఉన్నారు. అమెరికాలో ఇప్పటికే కొన్ని ఫిలిం ఫెస్టివల్స్‌తో పాటు స్పెషల్ షోలకు రాజమౌళి వెళ్లాడు. ఈ సందర్భంగా తాజాగా ఒక స్పెషల్ షో తర్వాత ‘ఆర్ఆర్ఆర్’కు సీక్వెల్ ఉంటుందని, దాని మీద తన తండ్రి పని చేస్తున్నారని వెల్లడించాడు జక్కన్న.

ఐతే ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ గురించి ఇంతకుముందు కూడా రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ సంకేతాలు ఇచ్చారు. కానీ వాళ్లు అంత పక్కాగా చెబుతున్నా సరే.. జనాలకు అయితే నమ్మకం కలగట్లేదు. ఈ కథను సీక్వెల్‌గా విస్తరించడం ఒక సవాలు అయితే.. మళ్లీ ఈ సినిమా కోసం జక్కన్న ఖాళీ చేసుకోవడం.. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల డేట్లను మూణ్నాలుగేళ్లు సంపాదించడం వీలయ్యే పనిలా కనిపించడం లేదు. రాజమౌళి తర్వాతి సినిమా మహేష్ బాబుతో అన్న సంగతి తెలిసిందే. అది పూర్తయి రిలీజ్ కావడానికి ఇంకో మూడేళ్లయినా పడుతుంది.
మరోవైపేమో రాజమౌళి కోసం వేరే హీరోలు, నిర్మాతలు చాలామంది వెయిటింగ్‌లో ఉన్నారు. ఇంకవైపేమో ఆయన కలల ప్రాజెక్టు ‘మహాభారతం’ కూడా వెయిటింగ్‌లో ఉంది. ఆ సినిమా తీయడానికి అవసరమైన అనుభవాన్నందతా జక్కన్న సంపాదించేశారు. చాలా భాగాలుగా రావాల్సిన ఆ సినిమాను మొదలుపెడితే పదేళ్లకు తక్కువ కాకుండా దానికి అంకింత కావాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని చూస్తే ‘ఆర్ఆర్ఆర్-2’ నిజంగా ఉంటుందా అన్నది సందేహమే. కేవలం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ కోసమే ఈ మాట అంటున్నారనే సందహాలు కలుగుతున్నాయి.