పుష్ప-2తో స్క్రీన్లు పగిలిపోతాయ్

గత ఏడాది చివర్లో విడుదలైన ‘పుష్ప’ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ముందు డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో దాని బాక్సాపీస్ ఫలితం మీద సందేహాలు నెలకొన్నాయి. కానీ ఆ టాక్‌ను తట్టుకుని బలంగా నిలబడ్డ సినిమా.. భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగును మించి ఇతర భాషల్లో ఆ సినిమా బాగా ఆడింది. ముఖ్యంగా హిందీలో అయితే ట్రేడ్ పండిట్లను షాక్‌కు గురి చేసే వసూళ్లు రాబట్టింది.

ఇక ఆ సినిమా పాటలు, మేనరిజమ్స్ అంతర్జాతీయ స్థాయిలో ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. దీంతో ‘పుష్ప-2’ మీద అంచనాలు మరో స్థాయికి వెళ్లిపోయాయి. వాటిని అందుకోవడం కోసం సుకుమార్ తన టీంతో కలిసి మరింత కసరత్తు చేశాడు. బాగా టైం తీసుకుని సెకండ్ పార్ట్ కోసం స్క్రిప్టు రెడీ చేశాడు. ఇటీవలే చిత్ర బృందం చిత్రీకరణ కూడా మొదలుపెట్టింది.

ఐతే సినిమా ఆరంభ దశలో ఉండగానే అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లే స్టేట్మెంట్ ఇచ్చాడు అల్లు అర్జున్ ఆప్త మిత్రుడు, నిర్మాత బన్నీ వాసు. అల్లు శిరీష్ సినిమా ‘ఊర్వశివో రాక్షసివో’ సక్సెస్ మీట్లో అతను మాట్లాడుతూ.. తనను అందరూ ‘పుష్ప-2’ అప్‌డేట్ గురించి అడుగుతున్నారని.. వాళ్లందరికీ ఒకటే చెబుతున్నానని.. ‘పుష్ప-2’తో స్క్రీన్లు పగిలిపోతాయని బన్నీ వాసు పేర్కొన్నాడు. మామూలుగా స్క్రీన్లు చిరిగిపోతాయని అంటుంటారని.. కానీ ‘పుష్ప-2’ సినిమాది వేరే లెవెల్ అని, అందుకే ఆ సినిమాతో స్క్రీన్లు పగిలిపోతాయని అంటున్నానని బన్నీ వాసు అన్నాడు.

బన్నీ వాసు ఈ కామెంట్ చేస్తున్నపుడు బన్నీ ఎందుకు ఇంతగా చెబుతున్నావ్ అన్నట్లు అతణ్ని వారించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బన్నీ మాట్లాడుతూ.. పుష్ప-2 విషయంలో తగ్గేదే లే అని కామెంట్ చేశాడు. ఈ సినిమా ఫలితం కచ్చితంగా పాజిటివ్‌గా ఉంటుందని ఆశిస్తున్నానని.. తనకు కలిగిన ఎగ్జైట్మెంట్ ప్రేక్షకులకు కూడా కలుగుతుందని అనుకుంటున్నానని చెప్పాడు. ‘పుష్ప సినిమా తగ్గేదే లే అయితే.. పుష్ప-2 సినిమా అసలు తగ్గేదేలే’’ అని బన్నీ స్టేట్మెంట్ ఇచ్చాడు.