గ్యాప్ ఇచ్చాడు.. సంతోషం

టాలీవుడ్లో యువ క‌థానాయ‌కుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం జ‌ర్నీ చాలా చిత్ర‌మైంది. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి రాజావారు రాణివారు అనే సాఫ్ట్ ల‌వ్ స్టోరీతో హీరోగా మారిన అత‌ను.. ఆ సినిమా థియేట‌ర్ల‌లో ఉండ‌గా ప్రేక్ష‌కుల దృష్టిలో ప‌డ‌లేక‌పోయాడు. కానీ అదే సినిమా క‌రోనా టైంలో ఓటీటీలో విడుద‌లై మంచి స్పంద‌న తెచ్చుకుంది. కిర‌ణ్‌కు మంచి పేరు తెచ్చింది. ఆ గుర్తింపు క‌లిసొచ్చి ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం డివైడ్ టాక్‌తోనూ హిట్ట‌యింది. ఆస‌క్తిక‌ర ట్రైల‌ర్, మంచి పాట‌ల వ‌ల్ల సినిమాకు ఓపెనింగ్స్ బాగా వ‌చ్చాయి. సినిమా హిట్ అనిపించుకుంది. దీంతో వ‌రుస‌బెట్టి సినిమాలు వ‌ద‌ల‌డం మొద‌లుపెట్టాడు కిర‌ణ్‌. ఇలా ఈ ఏడాది ఇప్ప‌టికే సెబాస్టియ‌న్, స‌మ్మ‌త‌మే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూడు సినిమాలు రిలీజ‌య్యాయి. వీటిలో స‌మ్మ‌త‌మే కాస్త ప‌ర్వాలేదు. ఓ మోస్త‌రుగా ఆడింది. మిగ‌తా రెండు చిత్రాల గురించి మాట్లాడ్డం వేస్ట్.

ఓవైపు రెండు మూడు నెల‌ల‌కో సినిమా రిలీజ్ చేస్తూ.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సినిమాలు ప్ర‌క‌టిస్తూ జ‌నాల‌కు షాకుల మీద షాకులిస్తున్నాడు కిర‌ణ్‌. నేను మీకు బాగా కావాల్సిన వాడిని రిలీజై నెల తిర‌క్క‌ముందే గీతా ఆర్ట్స్ బేన‌ర్లో కిర‌ణ్‌ చేసిన విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ సినిమా రిలీజ్ అప్‌డేట్ అంటూ శ‌నివారం చిన్న టీజ‌ర్ వ‌ద‌ల‌డంతో జ‌నాలు కంగారు ప‌డిపోయారు. ఈ ఏడాది నాలుగో సినిమాను దించేస్తాడేమో అనుకున్నారు. కానీ కిర‌ణ్ కొంచెం గ్యాప్ ఇచ్చాడు. త‌న ఫ్యాన్స్ ఊపిరి తీసుకునే ఛాన్సిచ్చాడు.

విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ ఈ ఏడాది విడుద‌ల కావ‌ట్లేదు. 2023 ఫిబ్ర‌వ‌రి 17న శివ‌రాత్రి వీకెండ్లో రిలీజ్ కాబోతోంది. క్వాలిటీ చూసుకోకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఇలా సినిమా తీసి అలా వ‌దిలేస్తున్న కిర‌ణ్‌.. ఈ ఏడాది త‌గిలిన ఎదురు దెబ్బ‌ల‌తో కొంచెం జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్లున్నాడు. ఎంతైనా గీతా వారి సినిమా క‌దా. అందుకే కొంచెం జాగ్ర‌త్త‌గా సినిమాను తీర్చిదిద్దుకున్నాక‌ మంచి టైమింగ్ చూసి రిలీజ్ చేయాల‌ని ఫిక్స‌యిన‌ట్లున్నారు.