సురేష్ లెక్క ఎక్కడ తప్పుతోంది

ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా ఓకే చేసుకోవాలంటే దర్శక రచయితలకు అదో పెద్ద అగ్ని పరీక్ష, నిర్మాత రామానాయుడు గారు ఒక ప్రేక్షకుడిగా స్క్రిప్ట్ విని థియేటర్లో అది ఆడుతుందో లేదో సరిగ్గా పసిగట్టేవారు. ఆయన లెక్క తప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువ. బొబ్బిలి రాజా నుంచి భారీ చిత్రాల నిర్మాణ బాధ్యతలు సురేష్ బాబు చేతికి వచ్చాక తండ్రిని మించి తనయుడనే స్థాయిలో ఒక పక్క డిస్ట్రిబ్యూషన్ తో పాటు ప్రొడక్షన్ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించారు. తమిళ దర్శకుడిని తీసుకొచ్చి కలిసుందాం రా అనే ఫ్యామిలీ మూవీతో ఇండస్ట్రీ హిట్టు కొట్టడమనే ఉదాహరణ చాలు జడ్జ్ మెంట్ పవర్ చూపించడానికి.

కానీ ఈ మధ్య సురేష్ బాబు లెక్క పూర్తిగా తప్పుతోంది. కథలను సరిగా వినకుండా ఓకే చేస్తున్నారో లేక తను నిర్మాణ భాగస్వామినే కాబట్టి లాభమో నష్టమో అది అందరూ పంచుకుంటారనే నిర్లిప్తతో తెలియదు కానీ మొత్తానికి ఆ సంస్థ స్టాండర్డ్ కు తగ్గ బొమ్మలు రావడం లేదనేది దగ్గుబాటి అభిమానుల ఫిర్యాదు. ఇటీవలే వచ్చిన ప్రిన్స్ తెలుగులో ఫ్లాప్ దిశగా పరుగులు పెడితే అటు తమిళంలోనూ సోసోగానే ఆడుతోంది. ఆ మధ్య శాకినీ డాకిని, దొంగలున్నారు జాగ్రత్తలదీ ఇదే వరస. కేవలం ఓటిటి కంపనీల కండీషన్ మీదనే థియేటర్ రిలీజ్ చేశారన్న కామెంట్స్ నిజమే అనిపించాయి వాటి ఫలితాలు చూశాక.

అంతకు ముందు విరాట పర్వం సైతం సోషల్ మీడియా హడావిడి తప్ప టికెట్ కౌంటర్ల దగ్గర రాబట్టింది ఏమి లేదు. నారప్ప, దృశ్యం 2 లను నేరుగా ఓటిటికి ఇవ్వడం పట్ల ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్రుగానే ఉన్నారు. పెద్ద స్క్రీన్ మీద ఆడాల్సిన వాటిని డిజిటల్ లో, స్మార్ట్ ఫోన్ కే ఎక్కువనుకునే వాటిని థియేటర్లో విడుదల చేయడం ఇలా రివర్స్ లో వెళ్లడం ఏమిటని వాళ్ల ఆవేదన. ఇదంతా సురేష్ సోలో ప్రొడ్యూసర్ గా చేసినవి కాదు. అయినప్పటికీ అధిక శాతం జనానికి రెండు బొమ్మల లోగో చూసినప్పుడు ఇది నాయుడు గారిదే అనుకుంటారు తప్ప పార్ట్ నర్స్ ఎవరున్నారో చెక్ చేయరు. చూడాలి రాబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో.