నీళ్ల ప్రమోషన్ భలే ఉందే

దీపావళికి విడుదలైన నాలుగు సినిమాల్లో కార్తీ సర్దార్ దే కొంచెం పైచేయిగా కనిపిస్తోంది. ఓరి దేవుడాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ అది పూర్తి స్థాయి కలెక్షన్లుగా మారడం లేదు. వసూళ్లు స్లోగా పికప్ అవుతున్నాయి. ఆదివారం వెనుకనే పండగ సెలవు ఉండటంతో ఆశలన్నీ ఆ రెండు రోజుల మీదే ఉన్నాయి. ప్రిన్స్ పర్లేదనిపిస్తున్నా మరీ దూకుడుగా ఏం లేదు. జిన్నా రెండో వారం కొనసాగడం కష్టమనేలా కష్టపడుతోంది. ఓవర్సీస్ నెంబర్లు మరీ దారుణంగా ఉన్నాయి. తనకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని గుర్తించిన కార్తీ హైదరాబాద్ లోనే ఉంటూ ప్రమోషన్లు తగ్గకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు.

తమిళం కంటే తెలుగు రెస్పాన్సే బాగుండటం దానికి కారణం. స్వరాష్ట్రంలో టీమ్ కొత్త తరహా పబ్లిసిటీకి శ్రీకారం చుట్టింది. సర్దార్ చూసేందుకు వచ్చిన ఆడియన్స్ కి ఉచితంగా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ని పంపిణి చేస్తోంది. మాములుగా మల్టీప్లెక్సుల్లో యాభై నుంచి వంద రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సిన మంచి నీళ్లను ఫ్రీగా తీసుకోవచ్చన్న మాట. ఇదేదో బాగానే వర్కౌట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. సినిమాలో డిస్కస్ చేసిన పాయింట్ ఈ సమస్య గురించే. కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న మినరల్ వాటర్ బిజినెస్ ని చూపించిన తీరు ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

మొత్తానికి సర్దార్ బృందం మంచి ఆలోచనే చేసింది. ఫైనల్ దీపావళి విన్నర్ గా నిలిచేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అటు తమిళనాడులో ప్రిన్స్ కన్నా ఇదే బెటరనే అభిప్రాయం వ్యక్తం కావడంతో హైప్ తగ్గకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దర్శకుడు పిఎస్ మిత్రన్ సామజిక సమస్యలకు కమర్షియల్ మీటర్ ని జోడిస్తున్న తీరు శంకర్ ని గుర్తుకు తెస్తున్నా డ్రామా, యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో ఇంకొంచెం హోమ్ వర్క్ చేయాలనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. పొన్నియన్ సెల్వన్ 1 తర్వాత నెలలోపే కార్తీ రెండో హిట్టు కొట్టేశాడు.