శృతి హాసన్ డబుల్ బొనాంజ

ఒక హీరోయిన్ సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కావడం ఒకప్పుడు పరిపాటిగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం చాలా అరుదైపోయింది. కారణం కౌంట్ బాగా తగ్గిపోవడమే. అందులోనూ ఫామ్ తగ్గిన శృతి హాసన్ లాంటి వాళ్ళ గురించి చెప్పదేముంది. అయితే ఈసారి 2023 కమల్ తనయకు చాలా స్పెషల్ గా మిగిలిపోనుంది. సాలిడ్ మూవీస్ తో పవర్ ఫుల్ కంబ్యాక్ సెట్ చేసుకుంది. ఇది అనుకుని చేసింది కాకపోయినా అవకాశాలు అలా కలిసి వచ్చాయి. విషయానికి వస్తే చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి రెండింటిలో తనే కథానాయికన్న సంగతి తెలిసిందే. మొదటిసారి ఇద్దరు సీనియర్ హీరోలతో జట్టుకట్టింది.

రెండు ఒకే బ్యానర్ నుంచి వస్తున్నాయి. ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్లు. అభిమానులను అలరించడమే టార్గెట్ గా పెట్టుకుని ఆయా దర్శకులు వీటిని రూపొందిస్తున్నారు. సో సంక్రాంతికి శృతి హాసన్ డబుల్ బొనాంజా ఉంటుందన్న మాట. గతంలో ఈ తరహా అనుభవం సిమ్రాన్ కు దక్కింది. 2001 జనవరిలో మృగరాజు, నరసింహనాయుడులు ఒకే రోజు తలపడ్డాయి. బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సాధించగా చిరంజీవికి డిజాస్టర్ పడింది. ఆ టైంలో సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఫ్యాన్ వార్ ఓ రేంజ్ లో ఉండేది. వీటిలో సిమ్రానే హీరోయిన్.

మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదే చిరు బాలయ్యల సరసన శృతి హాసన్ ఆడి పడనుంది. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి యంగ్ జెనరేషన్ స్టార్లతో నటించిన శృతికి కాటమరాయుడు తర్వాత బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా రీ ఎంట్రీ. ఇవి రెండే కాదు ప్రభాస్ సలార్ లో కూడా తనే గ్లామర్ బ్యూటీ. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మంచి రోలే ఇచ్చారనే టాక్ ముందు నుంచి ఉంది. వీటిలో ఏ రెండు బ్లాక్ బస్టర్ అయినా కొత్త ఇన్నింగ్స్ మళ్ళీ వేగమందుకుంటుంది. లేదూ మూడూ హిట్ అయ్యాయంటే మాత్రం గబ్బర్ సింగ్ నాటి డిమాండ్ ని రిపీట్ చేయొచ్చు