విష్ణు మాటకు మోహన్ బాబు షాక్

మంచు మోహన్ బాబు ఏదైనా స్టేజ్ మీదికి ఎక్కారంటే మాటల తూటాలు పేలాల్సిందే. అవి కొన్నిసార్లు ఎవరికి తగులుతాయో కూడా అర్థం కాదు. తాజాగా తన పెద్ద కొడుకు మంచు విష్ణు మీదికే ఆయన బాణాలు విసిరారు. ఎన్టీ రామారావు, ఏఎన్నార్ లాంటి దిగ్గజ నటులే తనకు చెప్పని విషయాన్ని విష్ణు చెప్పాడంటూ కొంచెం సరదాగానే అతడి మీద వాగ్బాణాలు విసిరారు మోహన్ బాబు. ఇందుకు ‘జిన్నా’ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికగా మారింది.

“నేను 500కు పైగా సినిమాల్లో నటించాను. 75 సినిమాలకు పైగా నిర్మించాను. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు.. ఇలా ఎంతోమందితో కలిసి పని చేశాను. సినిమా వేడుకల్లో పాల్గొన్నాను. కానీ వాళ్లెవ్వరూ కూడా నువ్వు ఇన్ని నిమిషాలే మాట్లాడు అని నాకు చెప్పలేదు. కానీ మా విష్ణు బాబు మాత్రం ఈ రోజు ఉదయం నాతో ఒక మాట అన్నాడు. తక్కువ సమయం మాట్లాడండి. ఎక్కువ టైం తీసుకోవద్దు అని చెప్పాడు. ఆ మాటతో నేను షాకైపోయాను. అంతంత పెద్దవాళ్లే నాతో ఈ మాట చెప్పలేదు. ఈ మాట విష్ణు అనగానే మనమేమైనా ఎక్కువ టైం మాట్లాడేస్తున్నామా అనిపించింది. కానీ ఆ రోజులు వేరు. ఈ రోజులు వేరు” అని మోహన్ బాబు అన్నారు.

ఐతే ఆ తర్వాత తన కొడుకును మోహన్ బాబు ప్రశంసల్లో ముంచెత్తారు. “మన బిడ్డల్ని మనం పొగుడుకోకూడదన్నది శాస్త్రం. కానీ ‘జిన్నా’ సినిమాలో విష్ణు అద్భుతంగా నటించాడని ఇందులో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు చెప్పారు. విష్ణు ఈ సినిమాకు పడ్డ కష్టం మరే సినిమాకూ పడలేదు. చాలా రిస్కీ షాట్లు చేశాడు. అద్భుతంగా డ్యాన్సులు చేశాడు. సినిమా కోసం మరీ అంత కష్టపడాల్సిన పని లేదని, జాగ్రత్తగా ఉండాలని విష్ణుకు చెప్పాను. విష్ణు ఉత్తమ నటుడే కాదు.. ఉత్తమ వ్యక్తి కూడా. ‘జిన్నా’ సినిమా ‘ఢీ’ని మించి పది రెట్లు బాగా ఆడాలని కోరుకుంటున్నా” అని మోహన్ బాబు అన్నారు.