ఆహా అనిపించిన అల్లు వ్యూహం

మాములుగా టీవీ ఛానల్స్ లోనే సెలబ్రిటీ టాక్ షోలు రొటీన్ అయిపోయాయి. మొదట్లో రానా, మంచు లక్ష్మి లాంటి వాళ్ళు నిర్వహించినప్పుడు జనం కొత్తగా ఫీలయ్యి చూశారు కానీ యూట్యూబ్ ఛానల్స్ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి వాటిలోనూ లెక్కలేనన్ని ముఖాముఖీ కార్యక్రమాలు వచ్చాక ఇవి చూడటం తగ్గిపోయింది.

అలాంటిది డబ్బులు కట్టి చూసే ఓటిటిలో వీటిని మొదలుపెట్టడమంటే సాహసమే. అయినా ఆహా దానికి పూనుకుంది. మొదట్లో సమంతాతో సామ్ జామ్ అనే ప్రోగ్రాం చేశారు కానీ ఆది ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. చిరంజీవి, అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరోలు వచ్చినా లాభం లేకపోయింది.

అదయ్యాక ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణను మొట్టమొదటిసారిగా యాంకర్ గా మార్చి చేసిన అన్ స్టాపబుల్ ప్రోగ్రాం అద్భుత ఫలితాలను ఇచ్చింది. మాములుగా మీడియా కెమెరా ముందు తడబడే బాలయ్యలోని రియల్ ఎనర్జీని ఇందులో చూసి అభిమానులు మురిసిపోతే సామాన్య ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

మొత్తానికి షో సూపర్ హిట్ అయ్యింది. సెకండ్ సీజన్ కి డిమాండ్ వచ్చింది. ఇక్కడే అల్లు టీమ్ తమ వ్యూహాన్ని గొప్పగా అమలు పరిచింది. కార్యక్రమం మొదలుపెట్టే టైంకి సినీ స్టార్లు అందుబాటులో లేకపోవడంతో తెలివిగా మాజీ సిఎం, టిడిపి అధినేత స్వయానా బాలకృష్ణ బావ చంద్రబాబునాయుడుని తీసుకొచ్చింది.

మెయిన్ స్ట్రీమ్ మీడియా కాకుండా బయట ఇలాంటి టాక్ షోకి బాబు హాజరు కావడం ఇదే మొదటిసారి. దెబ్బకు కేవలం ప్రోమోతోనే ఎక్కడి లేని బజ్ వచ్చేసింది. రాజకీయ ప్రతిపక్షాలు ఈ అయిదు నిముషాల కంటెంట్ కే ఊగిపోయారు. న్యూస్ ఛానళ్లు ఏకంగా డిబేట్లు పెట్టేశాయి.

నిన్న ఫుల్ ఎపిసోడ్ వచ్చాక కొన్ని చోట్ల ఫ్యాన్స్ తెరలు కట్టుకుని ప్రొజెక్షన్ ఏర్పాటు చేసుకుని మరీ చూశారు. ఇంత హైప్ రావడానికి రెండు కారణాలు. మొదటిది బాబు కాంబో, రెండోది పొలిటికల్ గా చాలా సున్నితమైన ఇష్యూస్ ని ఇందులో టచ్ చేయడం. మొత్తానికి పక్కా వ్యూహంతో ఆశించిన దానికన్నా గొప్ప రిజల్టే అందుకుని అల్లు బృందం ఆహా అనిపించుకుందిగా