మ‌చ్చ శాస్త్రం ప్ర‌కారం న‌య‌న‌తార‌కు క‌వ‌ల‌లు

సౌత్ ఇండియ‌న్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఆదివారం తన అభిమానుల‌కు పెద్ద షాకే ఇచ్చింది. ఉన్న‌ట్లుండి త‌న‌కు క‌వ‌ల‌లు పుట్టిన‌ట్లు వెల్ల‌డించింది. న‌య‌న్, ఆమె భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ త‌మ ఇద్ద‌రు కొడుకుల కాళ్ల‌ను ముద్దాడుతున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. న‌య‌న‌తారకు పెళ్ల‌యి నాలుగు నెల‌లే అయింది. ఆమె గ‌ర్భం కూడా ధ‌రించ‌లేదు. ఈలోపే పిల్ల‌లేంటి అని చాలామంది ఆశ్చ‌ర్య‌పోయారు.

ఐతే సెల‌బ్రెటీలు చాలామంది లాగే న‌య‌న్ కూడా స‌రోగ‌సీ ద్వారా పిల్ల‌ల్ని క‌న్న విష‌యం జ‌నాల‌కు అర్థం కావ‌డానికి కొంచెం స‌మ‌యం ప‌ట్టింది. ఇదిలా ఉండ‌గా.. న‌య‌న్ క‌వ‌ల‌ల‌కు త‌ల్లి అయిన విష‌యం వెల్ల‌డైన కాసేప‌టికే ఆమె న‌టించిన ఒక తెలుగు సినిమాలోని స‌న్నివేశం తాలూకు వీడియో సోష‌ల్ మీడియాను ఊపేయ‌డం మొద‌లైంది. ఆ సినిమా అదుర్స్ కావ‌డం విశేషం.

ఈ సినిమాలో న‌య‌న‌తార ఇంట్రో సీన్లో స్విమ్మింగ్ పూల్ నుంచి ఆమె బ‌య‌టికి వ‌చ్చాక ఎన్టీఆర్ త‌న పుట్టు మ‌చ్చ‌ల గురించి మాట్లాడ‌తాడు. మ‌చ్చ శాస్త్ర ప్ర‌కారం మీకు క‌వ‌ల‌లు పుడ‌తారు అని కూడా అంటాడు. దానికి న‌య‌న్ బాగా ఉడుక్కుంటుంది.

ఇప్పుడు న‌య‌న్‌కు నిజంగానే క‌వ‌ల‌లు పుట్ట‌డంతో ఎన్టీఆర్ ఆనాడే చెప్పాడు ఈ విష‌యం అంటూ నెటిజ‌న్లు కామెడీ చేస్తున్నారు. అలాగే సినిమా చివ‌ర్లో న‌య‌న్ నిజంగానే మ‌గ క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌గా ఇద్ద‌రు బిడ్డ‌ల్ని బ్ర‌హ్మానందం ఒడిలో పెట్టుకుని ఆడించే సీన్ కూడా ఉంటుంది. ఆ సీన్‌ను కూడా ఇప్పుడు గుర్తు చేస్తూ ఆ చిత్ర ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌ను విజ‌న‌రీగా అభివ‌ర్ణిస్తున్నారు నెటిజ‌న్లు. ఏ చిన్న అవ‌కాశం దొరికినా చురుగ్గా స్పందిస్తూ మీమ్ ఫెస్టివ‌ల్ చేసే తెలుగు నెటిజ‌న్ల‌కు ఇలాంటి విష‌యాల్లో ఎలా చెల‌రేగిపోతారో తెలిసిందే.