గుడ్ బై టాక్ ఏంటి

టాలీవుడ్ శ్రీవల్లి రష్మిక మందన్న బాలీవుడ్ డెబ్యూ మూవీ గుడ్ బై ఈ వారంలో కాస్త చెప్పుకోదగ్గ బాలీవుడ్ స్ట్రెయిట్ రిలీజ్. ట్రైలర్ వచ్చినప్పుడు ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి కానీ ఓపెనింగ్స్ మాత్రం మరీ నీరసంగా రావడం ట్రేడ్ ని షాక్ లో ముంచెత్తింది. మొదటి రోజు కనీసం రెండు కోట్లయినా రాబడుతుందనుకుంటే కేవలం కోటి లోపలే ఫిగర్స్ నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. బిగ్ బి అమితాబ్ బచ్చన్, పుష్ప హీరోయిన్ కాంబినేషన్ లాంటి క్యాలికులేషన్లేవి పని చేయలేదని అర్థమవుతోంది. యాక్షన్ అండ్ మసాలా కంటెంట్ కి అలవాటు పడ్డ నార్త్ ఆడియన్స్ కి గుడ్ బై కనెక్ట్ కావడం లేదు.

అసలు సమస్య కంటెంట్ లోనే ఉంది. దర్శకుడు వికాస్ బహ్ల్ చనిపోయిన మనిషి చుట్టూ మనుషుల భావోద్వేగాలను ఎంటర్టైన్మెంట్ జోడించి చెప్పాలనే ప్రయత్నం చేశాడు. కానీ సెకండ్ హాఫ్ లో కథను ఆసక్తికరంగా నడిపించడంలో ఫెయిలవ్వడంతో ఆడియన్స్ తీవ్ర అసహనం ఫీలవుతున్నారు. ఓ కుటుంబంలో తల్లి(నీనా గుప్తా) చనిపోతుంది. ఆమె భర్త(అమితాబ్ బచ్చన్) అంతిమయాత్రకు ఏర్పాట్లు చేస్తుంటాడు. విదేశాల్లో ఉన్న కొడుకులు బయలుదేరతారు. లాయర్ చదివిన కూతురే రష్మిక మందన్న. కామెడీగా మొదలుపెట్టి ఎమోషనల్ గా టర్న్ చేద్దామనుకున్న వికాస్ ఎంటర్టైన్మెంట్ ని ఓవర్ డోస్ చేయడంతో గుడ్ బై సారీ చెప్పేసింది.

కథా కథనాల సంగతి ఎలా ఉన్నా ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ లు మాత్రం దీన్ని మరీ బ్యాడ్ ప్రోడక్ట్ కాకుండా కాపాడాయి. ముఖ్యంగా బిగ్ బిని ఎదురుగా పెట్టుకుని రష్మిక ఇచ్చిన నటన ఆకట్టుకునేలా సాగింది. సీతారామం తర్వాత దానికి మించి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఈ గుడ్ బైలో దొరికింది కానీ పెట్టుకున్న భారీ ఆశలు ఏ మేరకు నిలబడతాయో చెప్పలేం. ఒకపక్క గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్ కు స్క్రీన్లు పెరుగుతున్నాయి. విక్రమ్ వేదా నెమ్మదించినప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ 1 పర్లేదనేలా సాగుతోంది. వీటి మధ్య గుడ్ బై నెగ్గుకురావడం అంత ఈజీ అనిపించడం లేదు.