చివరికి మంచు విష్ణు కూడా..

శ్రీను వైట్ల.. ఒక పదేళ్లు వెనక్కి వెళ్తే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఈ పేరుండేది. టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుల్లో ఆయనొకరు. అప్పట్లో టాప్ స్టార్లు వైట్లతో సినిమాలు చేయడానికి క్యూలో ఉండేవారు. ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి బ్లాక్ బస్టర్లతో ఒకప్పుడు వైట్ల ఊపు మామూలుగా ఉండేది కాదు. కానీ బ్రూస్ లీ, ఆగడు, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా వరుసబెట్టి డిజాస్టర్లు ఇవ్వడంతో చాలా వేగంగా ఫేడవుట్ అయిపోయాడు ఈ స్టార్ డైరెక్టర్. కొంచెం గ్యాప్ తీసుకుని, తన శైలికి భిన్నంగా తీసిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సైతం పెద్ద డిజాస్టర్ కావడంతో వైట్ల మీద అందరికీ నమ్మకం పోయింది.

ఆ సినిమా దారుణమైన నష్టాలు మిగల్చడంతో వైట్లతో సినిమా తీయడానికి వేరే నిర్మాతలకు ధైర్యం సరిపోలేదు. ఈ స్థితిలో వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న మంచు విష్ణు.. వైట్లతో జట్టు కట్టడానికి ముందుకు వచ్చాడు. వీరి కలయికలో గతంలో వచ్చిన ‘ఢీ’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. దానికి కొనసాగింపుగా ‘డి అండ్ డి’ చేయాలని ఇద్దరూ అనుకున్నారు. ఈ సినిమా గురించి ప్రకటన కూడా వచ్చింది.

కొన్నేళ్ల పాటు ఏ సినిమా చేయని మంచు విష్ణు ఈ చిత్రంతోనే రీఎంట్రీ ఇస్తాడని అనుకున్నారంతా. కానీ ఏం జరిగిందో ఏమో.. విష్ణు ఈ ప్రాజెక్టు విషయంలో సైలెంట్ అయిపోయాడు. మధ్యలో ‘జిన్నా’ అనే వేరే సినిమాను తెరపైకి తీసుకొచ్చాడు. ఈ సినిమా పూర్తయింది. విడుదలకు కూడా సిద్ధమైంది. ఇప్పుడైనా ‘డి అండ్ డి’ని పట్టాలెక్కిస్తాడేమో అనుకుంటే.. అలా ఏమీ జరగలేదు. విష్ణు నుంచి రెస్పాన్స్ లేకపోవడం వల్లో, ఆ సినిమాను ఆపేయాలని ఇద్దరూ ఒక నిర్ణయానికి రావడం వల్లో కానీ.. వైట్ల ఇప్పుడు కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు. యాక్షన్ హీరో గోపీచంద్‌తో తన కొత్త సినిమా ఉంటుందని విజయదశమి సందర్భంగా వెల్లడించాడు.

తన మిత్రుడు, ఒకప్పుడు వరుసగా తనతో కలిసి సినిమాలు చేసిన గోపీ మోహన్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నట్లు కూడా వెల్లడించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెప్పాడు. ఫాంలో ఉన్న స్టార్లందరూ వైట్లను ఎప్పుడో పక్కన పెట్టేయగా.. చాలా ఏళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న మంచు విష్ణు సైతం ఆయనతో సినిమాను ముందుకు తీసుకెళ్లకపోవడం వైట్ల పరిస్థితిని తెలియజేసేదే.