మళ్లీ తెరపైకి కేసీఆర్ సినిమా

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడంలో కీలక భూమిక పోషించి.. కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కడమే కాక.. రెండో పర్యాయం కూడా అధికారం చేపట్టిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్ జీవితంలో సినిమా తీయడానికి సరిపడా డ్రామా కావాల్సినంత ఉంది.

ఆయన మీద సినిమా తీయాలని ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ భావించాడు. టైటిల్, క్యాప్షన్ కూడా ప్రకటించాడు. ఏదో ఒక పాట కూడా తయారు చేశాడు. కానీ కారణాలేంటో తెలియదు.. ఆ సినిమా ముందుకు కదల్లేదు.

ఐతే ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ మాత్రం కేసీఆర్ మీద సినిమా తీసే విషయంలో పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఇంతకుముందు పాన్ ఇండియా స్థాయిలో కేసీఆర్ సినిమా తీయబోతున్నట్లు శ్రీధర్ ప్రకటించడమే కాక.. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు కేసీఆర్ పాత్ర పోషించే అవకాశాలున్నట్లు కూడా తెలిపాడు.

మధుర శ్రీధర్ నిర్మాణం.. కేసీఆర్‌గా రాజ్ కుమార్ రావు అనగానే ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి కనిపించింది. ఐతే తర్వాత ఈ సినిమాపై ఏ అప్ డేట్ లేదు. దీంతో కేసీఆర్ సినిమా అటకెక్కేసిందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా కచ్చితంగా తెరకెక్కిస్తామంటూ తాజా అప్ డేట్ ఇచ్చాడు మధుర శ్రీధర్. కేసీఆర్‌ బయోపిక్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని, ఇది ఒక్క తెలుగు భాషలోనే కాకుండా, పాన్‌ ఇండియా సినిమాగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీధర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ఇప్పటికే స్క్రిప్టు సిద్ధమైందని.. బడ్జెట్‌ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పినట్లు ఆంధ్రప్రభ కథనం పేర్కొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్‌ మొదలు కావచ్చన్న మధుర శ్రీధర్‌, ఈ సినిమాలో భాగస్వామ్యం కోసం పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ప్రకటించాడు. ఈ చిత్రంలో మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కిరణ్‌కుమార్‌ రెడ్డిలతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరుల పాత్రలు కీలకంగా ఉంటాయట.