నితిన్‌కు డ‌బ్బింగే దిక్కా

యువ క‌థానాయ‌కుడు నితిన్ కెరీర్ ప్ర‌స్తుతం చాలా ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో ఉంది. అతను వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో స‌త‌మ‌తం అవుతున్నాడు. భీష్మ మిన‌హాయిస్తే గ‌త కొన్నేళ్ల‌లో అత‌డికి స‌రైన విజ‌య‌మే లేదు. ఆ సినిమా కూడా అన్ సీజ‌న్లో రిలీజ్ కావ‌డం వ‌ల్ల ఆశించిన స్థాయిలో వ‌సూళ్లు ద‌క్కించుకోలేక‌పోయింది.

గ‌త ఏడాది చెక్, రంగ్ దె చిత్రాల‌తో చేదు అనుభ‌వం ఎదుర్కొన్న నితిన్.. ఈ ఏడాది మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం రూపంలో పెద్ద డిజాస్ట‌ర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ దెబ్బ‌తో అత‌డి మార్కెట్ బాగా ప‌డిపోయి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఐతే తాను హీరోగా న‌టిస్తున్న చిత్రాల‌తో తీవ్ర నిరాశ ఎదుర్కొంటున్న నితిన్‌కు ఈ మ‌ధ్య త‌న బేన‌ర్ ద్వారా రిలీజ్ చేసిన‌ ఓ డ‌బ్బింగ్ సినిమా బాగా డ‌బ్బులు తెచ్చి పెట్టింది. ఆ చిత్ర‌మే.. విక్ర‌మ్.

ఈ క‌మ‌ల్ హాస‌న్ మూవీని నితిన్ సొంత బేన‌ర్ శ్రేష్ఠ్ మూవీసే రిలీజ్ చేసింది. సినిమా మీద పెట్టిన పెట్టుబ‌డి మీద మూడింతల ఆదాయం తెచ్చిపెట్టింది విక్ర‌మ్. ఈ స‌క్సెస్ నితిన్ సంస్థ‌కు పెద్ద రిలీఫ్ అన‌డంలో సందేహం లేదు. కానీ అంత‌లోనే మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంతో న‌ష్టాలు మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌చ్చింది.

కాగా విక్ర‌మ్ ఇచ్చిన ఉత్సాహంతో వ‌రుస‌గా డ‌బ్బింగ్ సినిమాల‌ను త‌మ బేన‌ర్ మీద రిలీజ్ చేయ‌డానికి నితిన్ ఫ్యామిలీ డిసైడైంది. ఈ గురువారం రిలీజ‌వుతున్న ఆర్య మూవీ కెప్టెన్‌ను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది శ్రేష్ఠ్ మూవీసే. ఐతే దీనికి పెద్ద‌గా బ‌జ్ లేదు. విక్ర‌మ్ లాగే రిలీజ్ త‌ర్వాత ఇది అద్భుతాలు చేస్తుందేమో చూడాలి. మ‌రోవైపు గౌత‌మ్ మీన‌న్‌-శింబుల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన వెందు త‌నింద‌దు కాదు సినిమాను కూడా తెలుగులో నితిన్ సంస్థే రిలీజ్ చేయ‌బోతోంద‌ట‌. ఈ చిత్రం సెప్టెంబ‌రు 15కు షెడ్యూల్ అయింది. చూస్తుంటే నితిన్‌కు డ‌బ్బింగ్ సినిమాలే మంచి ఆదాయ వ‌న‌రుగా క‌నిపిస్తున్న‌ట్లున్నాయి.