రాధేశ్యామ్.. ఇదో ర‌కం బాధ‌

‘రాధేశ్యామ్’ సినిమా రిలీజై ఐదు నెలలు దాటిపోయింది. కానీ దాని తాలూకు గాయాలు మాత్రం ప్రభాస్ అభిమానులను తొలిచివేస్తూనే ఉన్నాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ కూడా డిజాస్టరే అయినప్పటికీ.. ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయినా వచ్చాయి. పైగా ఆ చిత్రం యాక్షన్ ప్రియులను అంతో ఇంతో మెప్పించింది. అందులో కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ అయినా ఉన్నాయి. కానీ ‘రాధేశ్యామ్’ ఏ రకంగానూ మెప్పించలేదు.

ఊరికే భారీ లొకేషన్లు, కళ్లు చెదిరే విజువల్స్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, స్పెషల్ ఎఫెక్ట్స్ అన్న హంగామానే తప్ప సినిమాలో విషయం లేకపోయింది. కథాకథనాలు బలహీనంగా ఉండి ఈ హంగులు ఎన్ని జోడిస్తే ఏం లాభం అన్న ప్రశ్న తలెత్తింది. ముఖ్యంగా ఇటీవల ‘సీతారామం’ సినిమా రిలీజైనపుడు ‘రాధేశ్యామ్’ మీద పెద్ద చర్చే జరిగింది. అందులో మనసుకు హత్తుకునే కథాకథనాలు.. అద్భుతమైన ప్రేమ సన్నివేశాలు.. ఆర్టిస్టుల గ్రేట్ పెర్ఫామెన్స్ చూశాక ఇది కదా ఒక ప్రేమకథకు కావాల్సింది అనిపించింది.

తక్కువ బడ్జెట్లో ‘సీతారామం’ను ప్రేమకావ్యంగా మలిచిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ సినిమా చూసి ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ను, ఆ చిత్ర నిర్మాతలను గట్టిగానే వేసుకున్నారు. ‘సీతారామం’తో పోల్చి ‘రాధేశ్యామ్’ గాలి తీశారు. కట్ చేస్తే ఇప్పుడు మరోసారి ‘రాధేశ్యామ్’ గురించి నెగెటివ్ చర్చ నడుస్తోంది. ‘బాహుబలి’తో ఉత్తరాదిన తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న ప్రభాస్.. రెండే రెండు సినిమాలతో వాటిని బాగా దెబ్బ తీసుకున్నాడు.

ముఖ్యంగా ‘రాధేశ్యామ్’ చిత్రం ఉత్తరాదిన కేవలం రూ.18 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. అలాంటిది ఇప్పుడు ‘కార్తికేయ-2’ అనే చిన్న సినిమా.. హిందీలో సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. తొలి రోజు 50 షోలతో మొదలై ఇప్పుడు 3 వేల షోలు దాటిపోయింది. వసూళ్లు ఆల్రెడీ రూ.15 కోట్లు దాటిపోయాయి. త్వరలోనే ‘రాధేశ్యామ్’ను దాటడం ఖాయం. పుల్ రన్లో రూ.25 కోట్ల మార్కును కూడా అందుకోవడం లాంఛనం లాగే కనిపిస్తోంది. సినిమాలో విషయం ఉండాలే కానీ.. పెద్ద పెద్ద తారలు, భారీ బడ్జెట్లు ఏమీ అవసరం లేదంటూ మరోసారి ‘రాధేశ్యామ్’ను నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.