హీరోయిన్‌గా రోజా కూతురు?

సినీ కుటుంబాల నుంచి కొత్తగా హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు కానీ.. అమ్మాయిలు ఇటు వైపు రావడం తక్కువే. చాలా కొద్ది మంది మాత్రమే తమ కూతుళ్లను ఇండస్ట్రీలోకి తీసుకొస్తుంటారు. వాళ్లలో సక్సెస్ అయ్యేవాళ్లు కూడా తక్కువే. సీనియర్ హీరోయిన్ రాధ తన ఇద్దరు కూతుళ్లనూ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది. కానీ ఆ ఇద్దర ఫెయిలయ్యారు. కొంత కాలానికే కనుమరుగైపోయార.

మలయాళంలో మేనక తన కూతురు కీర్తి సురేష్‌ను పరిశ్రమలోకి తీసుకురాగా ఆమె మంచి పేరు సంపాదించి పెద్ద రేంజికి వెళ్లింది. ఆమెను చూశాక ఇంకా చాలా మంది సీనియర్ హీరోయిన్లకు ఆశ పుట్టి ఉండొచ్చు. అందులో రోజా కూడా ఉన్నట్లు సమాచారం. ఆమె తన కూతురు అన్షును కథానాయికను చేయాలని చూస్తున్నట్లు సమాచారం. చాలా ఏళ్లు తన కూతురిపై మీడియా కళ్లు పడకుండా చూసిన రోజా గత ఏడాది కాలంలో కొన్ని సందర్భాల్లో తన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తల్లి లాగే అందంగా, చక్కటి నవ్వుతో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించింది అన్షు. త్వరలోనే ఆమె కథానాయికగా పరిచయం కాబోతోందన్నది రోజా సన్నిహిత వర్గాల సమాచారం. ఒక సినీ వారసుడు కథానాయకుడిగా పరిచయం కానున్న సినిమాలో రోజా తనయ కూడా కథానాయికగా ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం అన్షు యుఎస్‌లోని ఒక ఫేమస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణకు వెళ్లబోతోందట.

ఆమెకు అక్కడ సీటు కన్ఫమ్ అయిందని.. కొన్ని నెలల పాటు అక్కడ శిక్షణ తీసుకుని, కోర్సు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొస్తుందని.. తర్వాత ఆమె తొలి చిత్రం మొదలవుతుందని అంటున్నారు. రోజాకు ఒక కొడుకు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అతను చిన్నవాడు. భవిష్యత్తులో అతను కూడా హీరోగా అరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం రోజా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పర్యాటక శాఖా మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంత్రిగా బాధ్యతలు అందుకున్నాక రోజా సినిమాలు, టీవీ షోలకు పూర్తిగా దూరం అయ్యారు.