ఛార్మితో బంధంపై పూరి ఫుల్ క్లారిటీ

పూరి జగన్నాథ్ వ్యక్తిగత జీవితం గురించి ఈ మధ్య రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. తన భార్య లావణ్య నుంచి ఆయన విడిపోతున్నాడని.. ఇందుకు కారణం ఛార్మీనే అనే ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. చాలా ఏళ్ల నుంచి ఛార్మి.. పూరి జగన్నాథ్‌ సినిమాల నిర్మాణ వ్యవహారాలన్నింటినీ ఛార్మీనే చూస్తోంది. ఆయనకు అన్ని రకాలుగా సహకారం అందిస్తోంది. పూరి తరఫున సోషల్ మీడియాలో ఏ సమాచారం ఇవ్వాలన్నే ఛార్మీనే ముందుంటోంది.

పూరీకి వ్యక్తిగత పీఆర్వోలాగా కూడా పని చేస్తోంది. ఇదంతా ప్రొఫెషనల్ వ్యవహారం లాగా కనిపిస్తున్నప్పటికీ.. కొందరు వారి బంధాన్ని మరో కోణంలో చూస్తున్నారు. ఇటీవల ‘లైగర్’ ప్రమోషనల్ ఈవెంట్లో ఛార్మి గురించి మాట్లాడుతూ పూరి ఐలవ్యూ చెప్పడాన్ని కూడా బూతద్దంలోనే చూశారు. ఆ మధ్య పూరి కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన ‘చోర్ బజార్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్.. పూరి భార్యను ముందు పెట్టుకుని, పరోక్షంగా ఛార్మి మీద కౌంటర్లు వేయడం కూడా ఈ సందేహాలకు మరింత బలం చేకూర్చింది.

ఐతే తన గురించి జరుగుతున్న ఈ అనవసర ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని పూరి నిర్ణయించుకున్నట్లున్నాడు. ఛార్మితో తన బంధం గురించి ఆయన మీడియాతో క్లారిటీగా మాట్లాడాడు. ‘‘ఆమె 50 ఏళ్ల మహిళ అయితే ప్రజలు ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆమె లావుగా ఉన్నా, మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా ఎవరికీ ఎలాంటి చింతా ఉండదు. కానీ ఛార్మి మంచి వయసులో ఉంది కాబట్టి మా ఇద్దరి మధ్య ఏదో ఉందని జనమంతా అనుకుంటున్నారు.

ప్రతి జంటకూ ఒక రొమాంటిక్ యాంగిల్, శృంగార పరమైన ఆకర్షణ ఉంటాయన్నది నా ఉద్దేశం. కానీ అది త్వరగా చచ్చిపోతుంది. మనందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఈ కోరికలనేవి కొన్ని రోజులకు పోతాయని అందరికీ తెలుసు. కేవలం స్నేహం మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఛార్మి 13 ఏళ్ల వయసు నుంచి నాకు తెలుసు. రెండు దశాబ్దాలుగా తనను చూస్తున్నా. ఆమె ఎలా కష్టపడి పని చేస్తుందో తెలుసు. తను నాకు మంచి ఫ్రెండ్’’ అని పూరి స్పష్టం చేశాడు.