సెన్సేషనల్ మూవీకి సీక్వెల్

జిగర్ తండ.. తమిళం అనే కాదు, సౌత్ ఇండియాలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ డ్రామా మూవీస్‌లో ఒకటి.  ఈ సినిమాలో కథాకథనాలు అసలు ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉంటాయి. సిద్దార్థ్ ప్రధాన పాత్రలో, బాబీ సింహా విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ‘పిజ్జా’తో దర్శకుడిగా పరిచయం అయిన కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించాడు. బాబీ సింహా విలన్ పాత్రలో విశ్వరూపం చూపించి ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ విలన్ పురస్కారం కూడా అందుకున్నాడు.

తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ అయి ఆయా భాష ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని ‘జిగర్ తండ’ ఎనిమిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ వెల్లడించాడు. ఈ అనౌన్స్‌మెంట్ కూడా చాలా ఆసక్తికరంగా జరిగింది. ‘జిగర్ తండ’కు సంబంధించిన విజువల్స్ చూపించి.. రెండు ఒక ఐస్ క్రీమ్ గ్లాస్ పక్కన ఇంకోటి పెట్టడం ద్వారా ‘జిగర్ తండ-2’ రాబోతున్నట్లు చెప్పకనే చెప్పాడు కార్తీక్.

జిగర్ తండ అంటే తమిళంలో చల్లని హృదయం కలిగిన అని అర్థం. అందుకే ఇలా ఐస్ క్రీమ్ గ్లాస్‌లు పెట్టాడు. ‘జిగర్ తండ’ తమిళంలో మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. అదొక కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిపోయింది అక్కడ. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు కిక్ ఇస్తూనే.. కమర్షియల్‌గానూ పెద్ద సక్సెస్ అయింది. తెలుగులో ఈ సినిమాను ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ చేశాడు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఒరిజినల్లో ఆత్మ చెడకుండానే అక్కడ విలన్‌ పాత్రనే ఇక్కడ లీడ్ రోల్ తరహాలో మార్చి ఆ క్యారెక్టర్లో వరుణ్ తేజ్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేసి హిట్ కొట్టాడు హరీష్.

ఇదే చిత్రం హిందీలో ‘బచ్చన్ పాండే’గా రీమేక్ అయింది. ఒరిజినల్లో సిద్దార్థ్ చేసిన పాత్రను అక్కడ కృతి శెట్టి చేయడం, తెలుగులో వరుణ్ మాదిరే హిందీలో అక్షయ్ కుమార్‌ను తీసుకుని ఆ పాత్రకు ఎలివేషన్ ఇచ్చారు. ఇప్పుడు ‘జిగర్ తండ’కు సీక్వెల్ అంటే తెలుగు, హిందీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి కలగడం ఖాయం. మరి కార్తీక్ ఆ కథను అలాగే కంటిన్యూ చేస్తూ సిద్ధు, బాబీ సింహాలతోనే సెకండ్ పార్ట్ చేస్తాడా.. లేక కథను మార్చి, వేరే నటీనటులను తీసుకుని దీన్నో ఫ్రాంఛైజీ మూవీలా మారుస్తాడా చూడాలి.