నేను షూటింగ్స్ ఆప‌ను.. తేల్చి చెప్పిన‌ అశ్వినీద‌త్

పారితోష‌కాలు ఎక్కువైపోయి నిర్మాణ వ్య‌యం బాగా పెరిగిపోవ‌డం, అదే స‌మ‌యంలో థియేట్రిక‌ల్ రెవెన్యూ బాగా పడిపోవ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ, ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డే వ‌ర‌కు షూటింగ్స్ ఆపాల‌ని టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ నిర్ణ‌యించ‌డం తెలిసిందే. గిల్డ్‌లో స‌భ్యులైన నిర్మాత‌లంద‌రూ ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్స్ ఆపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ఐతే అందులో స‌భ్యుడే అయిన సీనియ‌ర్ నిర్మాత అశ్వినీద‌త్‌.. గిల్డ్ నిర్ణ‌యాన్ని బేఖాత‌రు చేస్తున్నారు. ఈ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ.. త‌న నిర్మాణంలో తెర‌కెక్కుతున్న సినిమాల షూటింగ్స్ ఏవీ ఆపేది లేద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.

గిల్డ్ వ్య‌వ‌హారంపై ఆయ‌న ఒకింత అస‌హ‌నం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అస‌లీ గిల్డ్ ఎందుకు వ‌చ్చిందో తెలియ‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. హీరోల పారితోష‌కాలు పెర‌గ‌డం వ‌ల్లే టికెట్ల రేట్లు పెరిగాయ‌న్న అభిప్రాయంతో ఆయ‌న విభేదించారు. ఇంకా ప‌లు విష‌యాల‌పై ఆయ‌న ఏమ‌న్నారంటే..

“హీరోలకు భారీగా పారితోషికాలు ఇస్తున్నారనడం కరెక్ట్‌ కాదు. వాళ్లకున్న మార్కెట్‌ ప్రకారమే రెమ్యునరేషన్‌ తీసుకుంటారు. హీరోల పారితోషికాల వల్లే టికెట్‌ రేట్లు పెంచారనేది తప్పు. ఇప్పటి నిర్మాతల్లో స్థిరత్వం లేకపోవడం వల్ల వస్తున్న సమస్యలివి. నిర్మాతల శ్రేయస్సు కోసం అప్పట్లో ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైంది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. టికెట ధరలు తగ్గ్గించాలని ఓ సారి, పెంచాలని మరోసారి చెప్పడం వల్లే సినిమాపై ప్రేక్షకుల్లో విరక్తి కలిగింది. సీఎం దగ్గరకు వెళ్లి టికెట్‌ ధరలు పెంచమని కోరడమే దీనికి కారణం. టికెట్‌ ధరలు పెంచమని కోరిన వారే ఇప్పుడు షూటింగ్స్‌ బంద్‌ అని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సినిమా బడ్జెట్‌ ఎక్కువయ్యిందని సీఎంలను కలిసి రేట్లు పెంచుకున్నారు. టికెట్‌ ధరలు పెంచకముందే ఒక వ‌ర్గం ప్రేక్ష‌కులు సినిమా హాళ్లకు రావడం మానేశారు. ఇప్పుడున్న రేట్లకు అసలు రారు. థియేట‌ర్ల‌లోని క్యాంటీన్‌లలో విపరీతంగా రేట్లు పెంచారు. ఆ రేట్లతో ఫ్యామిలీతో సినిమాకు రావాలంటేనే భయపడుతున్నారు. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన ప్రేక్షకులు ఓటీటీకి అలవాటుపడ్డారు. అలా అని ఓటీటీల‌కు కూడా సినిమాలు ఇవ్వం అంటే ఇండ‌స్ట్రీకి ఇంకా క‌ష్ట‌మ‌వుతుంది” అని అశ్వినీద‌త్ అన్నారు.