థాంక్యూ.. అందరికీ రికార్డు ఇచ్చేసింది

‘మనం’ తర్వాత అక్కినేని నాగచైతన్య, విక్రమ్ కుమార్ కలిసి చేసిన సినిమా.. పైగా టాలీవుడ్లో జడ్జిమెంట్ కింగ్‌గా పేరున్న దిల్ రాజు నిర్మాత.. ‘థాంక్యూ’ మీద ప్రేక్షకులు అంచనాలు పెంచుకోవడానికి ఇంతకంటే కారణాలు ఏం కావాలి? ఈ సినిమా షూటింగ్ సుదీర్ఘంగా సాగుతుంటే.. విడుదల ఆలస్యం జరిగితే.. సినిమా విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా పకడ్బందీగా తీర్చిదిద్దుతున్నారేమో అని అంతా అనుకున్నారు.

కానీ చివరికి సినిమా చూసి అందరికీ దిమ్మదిరిగిపోయింది. ఇలాంటి సినిమా కోసమా ఇంత సమయం పెట్టారు.. అసలు చైతూ, విక్రమ్, దిల్ రాజు ఏ నమ్మకంతో సినిమాను మొదలుపెట్టారు.. ఇంత కష్టపడి ఈ చిత్రాన్ని పూర్తి చేశారు అని సందేహాలు కలిగాయి. వాళ్లు చేసిన పొరపాటుకు ఇప్పుడు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది. తమ కెరీర్లలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను ఈ ముగ్గురూ ఖాతాలో వేసుకోక తప్పట్లేదు. ఈ ముగ్గురికీ ఎప్పటికీ మరిచిపోలేని పాఠం నేర్పింది ‘థాంక్యూ’.

చైతూ-విక్రమ-రాజు కాంబినేషన్ సినిమా అంటే.. టాక్ ఎలా ఉన్నా ఒక పది కోట్లయినా షేర్ రావాలి. ఇప్పుడు బాక్సాఫీస్ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు కాబట్టి, వర్షాల ప్రభావం కూడా ఉంది కాబట్టి ఆ మొత్తంలో ఒక 30 శాతం తగ్గినా ఓకే అనుకోవచ్చు. కానీ తొలి వీకెండ్లో ఈ చిత్రం కేవలం రూ.3.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. వీకెండ్లోనే జనాలు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందంటే.. సోమవారం నుంచి సినిమా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. షోలు నడిపించాలంటే అందుకోసం ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అంతే తప్ప ఎక్కడా షేర్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ‘థాంక్యూ’ వీకెండ్ షేర్‌నే ఫుల్ రన్ షేర్‌గా ఫిక్సయిపోవచ్చు. ఈ సినిమా థియేట్రికల్ హక్కుల విలువ రూ.18 కోట్లని అంటున్నారు. అంటే దాదాపు రూ.15 కోట్ల దాకా నష్టం వచ్చిందన్నమాట. అంటే రావాల్సిన షేర్‌లో 20 శాతం మాత్రమే రికవర్ అయిందన్నమాట.

దిల్ రాజు, చైతూలిద్దరి కెరీర్లలోనూ పెద్ద డిజాస్టర్లున్నాయి. కానీ పర్సంటేజ్ పరంగా అవేవీ తెచ్చిపెట్టనంత నష్టం ‘థాంక్యూ’ మిగిల్చింది. వీళ్లిద్దరికీ ఇది కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టరే. విక్రమ్ కుమార్ కెరీర్లో ఫ్లాప్ అంటే ‘గ్యాంగ్ లీడర్’ మాత్రమే. అది ఓ మోస్తరుగానే ఆడింది. కాబట్టి ఆయనకు కూడా ‘థాంక్యూ’ బిగ్గెస్ట్ డిజాస్టర్ రికార్డును ఇచ్చేసినట్లే. హీరోయిన్ రాశి ఖన్నాకు కూడా కెరీర్లో ఇంత పెద్ద ఫ్లాప్ మరొకటి లేదనడంలో మరో మాట లేదు.