మేలు చేసిన ఓటిటే ఇప్పుడు శత్రువైంది

థియేటర్లకు కలెక్షన్లు నానాటికి తగ్గిపోతుండటం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితే. ప్రత్యేకంగా ఇది టాలీవుడ్ లోనే లేదు. ఇంకా చెప్పాలంటే మనం చాలా నయం. హిందీ సినిమాల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. గత మూడేళ్ళలో అయిదు వందల కోట్లు తెచ్చిన బాలీవుడ్ మూవీ ఒక్కటంటే ఒక్కటి లేదు. అందుకే ఆగస్ట్ 1 నుంచి కనీసం ఎనిమిది నుంచి పది వారాలు థియేటర్ కు ఓటిటి మధ్య గ్యాప్ ఉండేలా అక్కడి నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. దీని వెనుక మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ మద్దతు బలంగా ఉంది.

మనవాళ్ళు కూడా ఆ మధ్య ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఒకప్పుడు ఇదే ఓటిటి కరోనా కాలంలో ఎందరు నిర్మాతలను నష్టాలబారిన పడకుండా కాపాడిందో చూశాం. డైరెక్ట్ డిజిటల్ బాట పట్టిన కొన్ని డిజాస్టర్లు ఒకవేళ బిగ్ స్క్రీన్ మీద రిలీజ్ అయ్యుంటే ఆ ప్రొడ్యూసర్లు చవిచూడాల్సిన నష్టాలు లెక్కేసుకుంటే వెన్నులో వణుకు పుడుతుంది. లాక్ డౌన్ మొత్తం అయ్యాక ఇప్పుడు చాలా సినిమాలు మూడు వారాల విండోతో ఓటిటిలో వచ్చేస్తున్నాయి. దాని వల్లే కలెక్షన్లు లేవని భావిస్తున్న నిర్మాతలు అడ్డుకట్ట వేయాలని ట్రై చేస్తున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ కేవలం దీనివల్లే ఇప్పటికిప్పుడు ప్రేక్షకులు మారిపోరు. బలమైన కంటెంట్ నే థియేటర్లలో ఆదరిస్తున్నారు. ఇందులో ఎలాంటి డిబేట్ అక్కర్లేదు. ఒకప్పటిలా యావరేజ్ సినిమాలుకు సైతం డీసెంట్ కలెక్షన్లు వచ్చే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు కేవలం కాంబినేషన్లు క్రేజ్ లను నమ్ముకుని నిర్మాణాలు చేస్తే మాత్రం ఎదురుదెబ్బలు తప్పవని అక్షయ్ కుమార్ జాన్ అబ్రహం లాంటి బడా హీరోల చిత్రాలే ఋజువు చేశాయి. అలాంటప్పుడు బాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు కఠినంగా అమలు చేయాలని పెట్టుకున్న నిబంధనలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో చెప్పలేం. అవి సౌత్ మేకర్స్ కూ ఉపయోగపడతాయి. చూద్దాం