త‌క్కువ రేట్ల‌కే జ‌నం రావ‌ట్లేదంటే..

మా సినిమాకు టికెట్ రేట్లు త‌క్కువ అని పోస్ట‌ర్ల మీద వేసుకుని, ప్రెస్ మీట్ల‌లో ఘ‌నంగా ప్ర‌క‌టించుకుని సినిమాలు రిలీజ్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించి ఉండ‌రు. కొవిడ్ త‌ర్వాత మారిన ప‌రిస్థితుల్లో ఇది అనివార్యం అయింది. ప్ర‌భుత్వం అవ‌కాశం ఇచ్చింది క‌దా అని అయిన కాడికి రేట్లు పెంచేసి.. జ‌నాల‌కు థియేట‌ర్ల ప‌ట్ల విముఖ‌త పెంచేస్తున్నారు.

ఓవైపు కొవిడ్ వ‌ల్ల థియేట‌ర్ల‌కు వెళ్లే అల‌వాటు త‌ప్ప‌డం, పైగా ఓటీటీలో బోలెడంత కంటెంట్ అందుబాటులో ఉండ‌డంతో ఇప్ప‌టికే థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య త‌గ్గ‌గా.. ఇప్పుడు అధిక రేట్లు వారిని మ‌రింత వెన‌క్కి లాగుతున్నాయి. ఈ ప్ర‌భావం కొన్ని పెద్ద సినిమాల మీదా గ‌ట్టిగా ప‌డ‌డంతో ఈ మ‌ధ్య చిన్న‌, మీడియం రేంజ్ సినిమాల‌కు రేట్లు త‌గ్గించ‌డం తెలిసిందే. అయినా స‌రే.. థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య పెద్ద‌గా పెరిగిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. సినిమా చాలా బాగుందంటే త‌ప్ప జ‌నం రావ‌ట్లేదు.

ఇలాంటి త‌రుణంలో రామ్ లాంటి మిడ్ రేంజ్ హీరో న‌టించిన ది వారియ‌ర్ సినిమాకు పెట్టిన టికెట్ల ధ‌ర‌లు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి. హైద‌రాబాద్‌లోని మ‌ల్టీప్లెక్సులు అన్నింట్లోనూ ఈ చిత్రానికి రూ.295 రేటు ఫిక్స్ చేశారు. ఇంట‌ర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు క‌లిపితే రేటు 330 అవుతోంది. సింగిల్ స్క్రీన్ల ధ‌ర రూ.175గా ఉంది. ఛార్జీల‌తో క‌లిపితే 200 దాటుతోంది. ఈ రేంజ్ సినిమాకు సింగిల్ స్క్రీన్ల‌లో 150, మ‌ల్టీప్లెక్సుల్లో 200 ధ‌ర‌లైతే రీజ‌న‌బుల్ అనిపిస్తాయి.

హైద‌రాబాద్ లాంటి సిటీల్లో సింగిల్ స్క్రీన్ల‌తో స‌మానంగా మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్లున్నాయి. జ‌నం కూడా క్వాలిటీ, క్లారిటీ కోసం వాటికి బాగానే వెళ్తున్నారు. కానీ ఈ సినిమాకు పెట్టిన రేటు చాలా ఎక్కువ అనే అభిప్రాయం వారిలో ఉంది. రామ్ సినిమా అంటే యూత్, ఫ్యామిలీస్ బాగానే థియేట‌ర్ల‌కు వ‌స్తారు. కానీ ఈ రేటుతో అంటే ఫ్యామిలీస్‌కు చాలా క‌ష్టం. యూత్ కూడా ఆలోచిస్తారు. సింగిల్ స్క్రీన్ల‌లో సైతం రూ.200తో టికెట్ బుక్ చేయాలంటే ఇబ్బందే. మ‌రి రీజ‌న‌బుల్ రేట్ల‌తో ఎక్కువ‌మంది ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించే అవ‌కాశాన్ని నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ఎందుకు వ‌దులుకుంటున్నార‌న్న‌ది అర్థం కాని విష‌యం.