వారసుడిని చుట్టుకున్న కాపీ గోల

సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమో ఏది అబద్దమో అంత త్వరగా అంతు చిక్కడం లేదు. ఫేస్ బుక్కులు, ట్విట్టర్ లు జనాల స్మార్ట్ ఫోన్స్ లో సింహభాగం ఆక్రమించాక సినిమాలకు సంబంధించిన ప్రతి విషయమూ వైరల్ కావడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి రిలీజ్ కు ముందు అది ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ని కాపీ కొట్టి తీశారని నెటిజెన్లు నానా రచ్చ చేస్తే ఏకంగా దాని దర్శకుడు లైన్లోకొచ్చి అవునా నిజమా అంటూ హంగామా చేశారు. విడుదల దాకా ఈ హడావిడి జోరుగానే సాగింది.

కట్ చేస్తే రెండు సినిమాలు చూసిన వాళ్లకు పోలికలు కనిపించిన మాట వాస్తవం. దీన్ని కాసేపు పక్కనపెడితే ఇప్పుడు వారసుడికి ఈ భూతం తగులుకునేలా ఉంది. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. దీనికి సంబంధించిన స్టోరీ ఇదేనంటూ కొన్ని మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఓ బడా బిలియనీర్ చనిపోతే ఎక్కడో రహస్యంగా పెరుగుతున్న వారసుడు తిరిగి వచ్చి తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడమే వారసుడు కథగా అందులో పేర్కొన్నారు.

లార్గో వించ్, అజ్ఞాతవాసిలోనూ మెయిన్ పాయింట్ ఇదే. ఇప్పుడా ఆ డైరెక్టర్ జెరోమ్ సల్లే మళ్ళీ రంగంలోకి దిగి అవునా అంటూ రీ ట్వీట్లు చేస్తుండటం అసలు ట్విస్ట్. కేవలం టైటిల్ ని పట్టుకుని ఈ స్టోరీని అల్లారా లేక ఏదైనా లీక్ బయటికి వచ్చిందా అనేది కనీసం ట్రైలర్ వస్తే కానీ చెప్పలేం. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ లో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. 2023 సంక్రాంతిని టార్గెట్ చేసుకున్న వారసుడు మీద విక్రమ్ రికార్డులు బ్రేక్ చేయాలన్న ఒత్తిడి ఫ్యాన్స్ నుంచి వస్తోంది