యూట్యూబ్ స్టార్‌తో ఆహా సిరీస్

షణ్ముఖ్ జశ్వంత్ అలియాస్ షన్ను.. టీనేజీలోనే యూత్‌లో మంచి పాపులారిటీ సంపాదించిన కుర్రాడితను. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్‌, వెబ్ సిరీస్‌లతో అతడికి ఊహించిన స్థాయిలో ఫాలోయింగ్, పాపులారిటీ వచ్చింది. ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’, ‘సూర్య’ లాంటి సిరీస్‌లకు యూట్యూబ్‌లో వచ్చిన వ్యూస్, లైక్స్ చూస్తే దిమ్మదిరిగిపోతుంది. తన వయసు అమ్మాయిలు, అబ్బాయిలకు అతను ఈ సిరీస్‌లతో పిచ్చెక్కించేశాడు.

యూట్యూబ్‌లో 4 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించిన తొలి తెలుగు యూట్యూబర్ అతనే కావడం విశేషం. ఈ పాపులారిటీతోనే షన్ను బిగ్ బాస్‌ హౌస్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. గత ఏడాది ఐదో సీజన్లో టైటిల్‌కు టాప్ కంటెండర్లలో ఒకడిగా కొనసాగిన షన్ను.. చివరికి త్రుటిలో టైటిల్ చేజార్చుకుని, రన్నరప్‌గా నిలిచాడు. ఐతే ఆ తర్వాత షన్ను ఇప్పటిదాకా ఏ కొత్త సిరీస్‌లు కానీ, షార్ట్స్ కానీ చేయలేదు. గతంలో మాదిరి మ్యూజిక్ వీడియోలు కూడా ఏమీ చేయడం లేదు.

‘బిగ్ బాస్’ నుంచి బయటికి వచ్చాక చాలామంది లాగే షన్ను కూడా సైలెంట్ అయిపోయాడేంటి అని అంతా అనుకుంటుండగా.. అతను ఓ పెద్ద ప్రాజెక్టుతోనే రీఎంట్రీకి రెడీ అయ్యాడు. ప్రస్తుతం తెలుగులో టాప్ ఓటీటీల్లో ఒకటైన ఆహా షన్నుతో ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తోంది. దానికి ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ (ఏఏఎస్) అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ‘‘చంటబ్బాయికి వారసుడు.. ఆత్రేయకు తమ్ముడు.. పరిహాసంలో కానీ, పరిష్కారంలో కానీ తగ్గేదే లే’’ అంటూ ఏజెంట్ ఆనంద్ సంతోష్‌కు ఆసక్తికర ఇంట్రో కూడా ఇచ్చారు. ఫస్ట్ లుక్‌లో డిటెక్టివ్ అవతారంలో షన్ను ఆకర్షణీయంగానే కనిపించాడు.

సాయిధరమ్ తేజ్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’తో దర్శకుడిగా పరిచయం అయిన సుబ్బు ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి సినిమా ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో వెబ్ సిరీస్ బాట పట్టినట్లున్నాడు సుబ్బు. మరి యూట్యూబ్ స్టార్‌తో అతడి ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.