#RC15 లెక్క మారుతోంది

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ RC15 కి సంబంధించి రోజు రోజుకి బడ్జెట్ పెరుగుతుందని ఇన్సైడ్ టాక్. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకముందు సుమారు 200 కోట్ల నుండి 250 కోట్ల బడ్జెట్ అనుకున్నారు. కానీ ఆ లెక్క ఎప్పుడో దాటేసిందని తెలుస్తుంది.

శంకర్ కి ‘రోబో’ తర్వాత సరైన హిట్ లేదు. దీంతో ఈ అగ్ర దర్శకుడికి అడిగినంత భారీ వ్యయం పెట్టేందుకు కోలీవుడ్ లో కూడా ఏ నిర్మాత రెడీగా లేడు. కానీ దిల్ రాజు 200 కోట్లతో శంకర్ తో సినిమా డీల్ సెట్ చేసుకున్నాడు. ముందు రెండొందల కోట్లు , తక్కువ వర్కింగ్ డేస్ లోనే ఫినిష్ చేయాలని శంకర్ తో దిల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఇప్పుడు వర్కింగ్ డేస్ అమాంతంగా పెంచేస్తూ ఓవర్ బడ్జెట్ లైన్లోకి ప్రాజెక్ట్ ని తీసుకెళ్ళిపోయాడట శంకర్.

సినిమాకు సంబంధించి అంతా అవుట్ డోర్ లోనే షూట్ చేస్తున్నారు. దీంతో అనుకున్న బడ్జెట్ మించి ఖర్చవుతుందట. ఒక్క రాజమండ్రి షెడ్యుల్ లోనే పాతిక కోట్లకు పైగా ఖర్చయిందని తెలుస్తుంది. ఇక మధ్యలో ఆర్ట్ డైరెక్టర్ ని మార్చేసి రవీందర్ రెడ్డి ని తీసుకున్నారు. మళ్ళీ ఆయన రెమ్యునరేషన్ భారం కూడా నిర్మాత మీదే పడనుంది. ఎందుకంటే రామకృష్ణ , మౌనిక ఇద్దరు ఆల్మోస్ట్ ఆర్ట్ వర్క్ ఫినిష్ చేశారు. 70 % పైగానే వర్క్ చేశారు. అంటే మిగతా ముప్పై పర్సెంట్ షూట్ కి గానూ వారి లెక్క కూడా సరిపోయిందని మళ్ళీ రవీందర్ రెడ్డి కి అదనంగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుందని ఇన్సైడ్ టాక్.

అయితే బడ్జెట్ పెరిగినప్పటికీ దిల్ రాజు మీద పడే ఎఫెక్ట్ మాత్రమే తక్కువే..ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కోసం జీ స్టూడియోస్ దాదాపు 200 కోట్లు పెట్టుబడి పెడుతుంది. మిగతా బడ్జెట్ భారం దిల్ రాజు మోయాల్సి వస్తుంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించి ఇంకా 30 % పర్సెంట్ షూట్ బ్యాలెన్స్ ఉంది. నవంబర్ లేదా డిసెంబర్ కల్లా టోటల్ షూట్ పూర్తి చేయాలని ముందు ప్లాన్ వేసుకున్నారు. కానీ శంకర్ నో కాంప్రమైజ్ అంటూ ఆ ప్లానింగ్ మర్చేశాడట. టోటల్ షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి వచ్చే ఏడాది సమ్మర్ అవ్వొచ్చని అంటున్నారు.

మిగిలిన షూట్ పోర్షన్ లో కీలక పతాక సన్నివేశాలు తీయాల్సి ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ కి శంకర్ ఎక్కువ టైం తీసుకోనున్నాడట. తాజాగా ఇంటర్వెల్ బ్లాక్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. టీమ్ మరో సారి అమ్రిత్సర్ వెళ్లనుంది. అక్కడ భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.