మోహన్ బాబు-లక్ష్మీప్రసన్న.. అగ్ని నక్షత్రం


తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మంచు మోహన్ బాబు ఒకరు. సినిమాలు చాలా వరకు తగ్గించేయడం వల్ల, కొన్ని వివాదాల వల్ల ఆయన పాపులారిటీ తగ్గింది కానీ.. నటుడిగా ఆయనది గొప్ప స్థాయే. చివరగా ‘సన్నాఫ్ ఇండియా’ అనే పేలవమైన సినిమా చేయడంతో ఆయన మరోసారి బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవం ఎదుర్కొన్నారు. అలా అని ఆయనేమీ సినిమాలు మానేయడం లేదు.

మణిరత్నం సినిమా ‘పొన్నియన్ సెల్వన్’లో ఓ కీలక పాత్రతో పలకరించబోతున్న మోహన్ బాబు.. తెలుగులో మళ్లీ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈసారి ఆయన తన ముద్దుల కూతురు లక్ష్మీప్రసన్నతో కలిసి నటించబోతుండటం విశేషం. తన తండ్రితో తాను స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయాన్ని పరోక్షంగా రెండు రోజుల కిందటే వెల్లడించిన లక్ష్మి.. ఈ రోజు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

‘‘ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. నటిగా ఈ రంగంలోకి వస్తాననే నేనెప్పుడూ కలగనలేదు. అలాంటిది ఈ రోజు మా నాన్నతో కలిసి ఓ సినిమాలో నటించే అవకాశం లభించింది. మేమిద్దరం కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి ‘అగ్నినక్షత్రం’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విమర్శలు, ట్రోల్స్ గురించి అసలు పట్టించుకోకుండా మీ హృదయం చెప్పింది విని అడుగులు ముందుకు వేయండి’’ అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో పేర్కొంది లక్ష్మి.

లక్ష్మి-మోహన్ బాబు కలిసి నటిస్తున్న చిత్రాన్ని ప్రతీక్ ప్రజోష్ అనే కొత్త దర్శకుడు రూపొందించనున్నాడు. టైటిల్ మోషన్ పోస్టర్‌ను బట్టి చూస్తే ఇదొక పోలీస్ స్టోరీలా కనిపిస్తోంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ చూడొచ్చనిపిస్తోంది. మోహన్ బాబు-లక్ష్మీ ఇందులో ఒకరినొకరు ఢీకొట్టే పాత్రల్లో కనిపిస్తారని అంటున్నారు. మరి ఈ తండ్రీ కూతుళ్ల పోరు తెరపై ఎంత బాగా పండుతుందో.. ఈ చిత్రానికి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.