థియేటర్లలో తుస్.. ఓటీటీలో భేష్

అజయ్ దేవగణ్ బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడు. కరోనాకు ముందు విడుదలైన అజయ్ చివరి సినిమా ‘తానాజీ’ 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమాతో ఆయన మార్కెట్ అమాంతం పెరిగింది. దీంతో తర్వాత చేయబోయే సినిమాకు అది బాగా కలిసొస్తుందని అనుకున్నారు. అందుకేనేమో.. తర్వాతి చిత్రాన్ని వేరే వాళ్లకు చేయకుండా స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో ‘రన్ వే 34’ను రూపొందించాడు.

ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ ఎయిర్ థ్రిల్లర్.. రెండు నెలల కిందట థియేటర్లలోకి దిగింది. సినిమాకు మంచి రివ్యూలొచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగుంది. కానీ వసూళ్లలో మాత్రం అది ప్రతిఫలించలేదు. తొలి రోజు మూడున్నర కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించిన ఈ చిత్రం.. ఫుల్ రన్లో రూ.20 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. చాన్నాళ్లు ఎదురు చూసి థియేటర్లలో రిలీజ్ చేస్తే ఇలాంటి ఫలితం వచ్చేసరికి అజయ్ అండ్ టీం షాకైపోయింది.

ఐతే ఈ మధ్య చాలా హిందీ సినిమాల విషయంలో జరుగుతున్నదేంటంటే.. థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీల్లో మాత్రం గొప్ప ఆదరణ దక్కుతోంది. ‘రన్ వే 34’ కూడా ఆ జాబితాలోనే చేరింది. అమేజాన్ ప్రైమ్‌లో ముందు ఈ చిత్రాన్ని రెంట్ ఆప్షన్‌తో రిలీజ్ చేశారు. కొన్ని వారాల తర్వాత ఫ్రీగా సబ్‌స్క్రైబర్లందరికీ చూసే అవకాశం కల్పించారు. అప్పట్నుంచి ‘రన్ వే 34’కు రెస్పాన్స్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఓ కొత్త సినిమా రిలీజైనట్లు దీని గురించి పోస్టులు పెడుతున్నారు. రిలీజైన దగ్గర్నుంచి ప్రైమ్‌లో ఇదే నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. అందులో సినిమా చూసిన వాళ్లు థియేటర్లలో ఎందుకు ఆడలేదో అని ఆశ్చర్యపోతున్నారు.

క్రేజీ, మాస్ కంటెంట్ ఉంటేనే ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ టైంలో పట్టించుకోకపోవడం.. సినిమా ఏదో నామమాత్రంగా ఆడేసి ఓటీటీల్లోకి వచ్చాక చూసి ఈ సినిమా భలే ఉందే సోషల్ మీడియాలో కొనియాడడం మామూలైపోయింది. తెలుగులో ఈ మధ్య ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం విషయంలోనూ ఇలాంటి స్పందనే కనిపించింది.