బాలీవుడ్లోకి మరో తెలుగు దర్శకుడు

తెలుగు సినిమాల్లో సత్తా చాటుకుని బాలీవుడ్‌కు వెళ్లిన దర్శకులు ఎంతోమంది ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ నుంచి సందీప్ రెడ్డి వరకు బాలీవుడ్‌కు వెళ్లి అక్కడా హిట్లు కొట్టారు. ఈ జాబితాలో మరో దర్శకుడు చేరబోతున్నాడు. అతనే.. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి. తొలి సినిమాతోనే అతడి సత్తా ఏంటో దేశమంతా తెలిసింది. ‘ఘాజీ’ హిందీలోనూ చాలా బాగా ఆడింది. ఐతే రెండో సినిమా ‘అంతరిక్షం’తో సంకల్ప్ అంచనాల్ని అందుకోలేకపోయాడు.

మంచి ప్రయత్నమే చేసినా అది కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. దీని తర్వాత సినిమాలకు బ్రేక్ తీసుకుని ‘లస్ట్ స్టోరీ’ వెబ్ సిరీస్ తెలుగు వెర్షన్లో ఓ పోర్షన్‌ను డైరెక్ట్ చేశాడు సంకల్ప్. లాక్ డౌన్ లేకుంటే ఈ పాటికి నెట్ ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ ప్రసారం కూడా అయ్యేదేమో. త్వరలోనే దీని స్ట్రీమింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.

దీని తర్వాత సంకల్ప్ ఏం సినిమా చేస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. అతను బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తాజా సమాచారం. ‘కమాండో’ ఫేమ్ విద్యుత్ జమాల్ హీరోగా సంకల్ప్ ఓ హిందీ సినిమా తీయబోతున్నాడట. ఇది ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగుతుందట. సంకల్ప్ స్టయిల్లోనే ప్రయోగాత్మకంగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. సైన్స్ నేపథ్యంలో సినిమాలు తీయడం సంకల్ప్‌కు బాగా ఇష్టం. ఆ జానర్ మీద మంచి పట్టుంది.

సంకల్ప్ కొత్త చిత్రంలోనే సైన్స్ సంబంధిత అంశాలు ప్రధానంగా ఉంటాయట. తెలుగులో విలన్‌గా విద్యుత్ అనేక సినిమాలు చేశాడు. హిందీలో ‘కమాండో’ సిరీస్ సహా హీరోగా నటించిన కొన్ని సినిమాలు బాగానే ఆడాయి. గత ఏడాది ‘కమాండో-3’తో పలకరించాడు విద్యుత్. దాని తర్వాత అతను నటించిన ‘ఖుదా హాఫిజ్’ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సంకల్ప్-విద్యుత్ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కే అవకాశముంది.