కొత్త వెబ్ సిరీస్‌ బావుందబ్బా

కరోనా మహమ్మారి థియేటర్ ఇండస్ట్రీని గట్టి దెబ్బే కొట్టింది కానీ.. అదే సమయంలో ఓటీటీలకు మాత్రం మంచి ఊపు తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా ఓటీటీలు పెరిగిపోయాయి. వాటిలో కంటెంట్ కూడా విస్తృతమైంది. ఈ క్రమంలో ప్రాంతీయ భాషల్లో బోలెడన్ని వెబ్ సిరీస్‌లు తయారవడం మొదలైంది. ఐతే ఆరంభంలో తెలుగులో చాలా వరకు సోసో అనిపించే వెబ్ సిరీస్‌లే వచ్చాయి.

నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్స్‌లో ఉన్న టాప్ క్లాస్ ఒరిజినల్స్ ముందు మన వాళ్లు తీసిన సిరీస్‌లు చాలా సాధారణంగా అనిపించాయి. కానీ ఈ మధ్య మన ఒరిజినల్స్‌లోనూ క్వాలిటీ పెరుగుతోంది. ఈ కోవలో వచ్చిన కొత్త సిరీసే.. రెక్కీ. ఈ మధ్య ‘గాలివాటం’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న జీ5 సంస్థ.. తాజాగా ఈ సిరీస్‌ను లాంచ్ చేసింది. విడుదలకు ముందు ప్రచార హడావుడి పెద్దగా లేకపోవడం వల్ల ఇది జనాల్లోకి వెళ్లలేదు కానీ.. ఇప్పుడు చూసిన వాళ్లందరూ దీని గురించి పాజిటివ్‌గా మాట్లాడుతుండటం ‘రెక్కీ’కి కలిసొస్తోంది.

రాయలసీమ ప్రాంతంలోని తాడిపత్రి (అనంతపురం జల్లా) నేపథ్యంలో నడిచే క్రైమ్ డ్రామా.. రెక్కీ. అక్కడి మున్సిపల్ ఛైర్మన్‌ను చంపడానికి ఒక గ్యాంగ్ దిగడం.. వాళ్లు రెక్కీ చేసి అతణ్ని మట్టుబెట్టడం.. ప్రధానంగా ఈ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఐతే ఈ హత్య వెనుక ఎవరున్నారన్నది పెద్ద ట్విస్ట్. ఆ తర్వాత ఛైర్మన్ కొడుకు కూడా హత్యకు గురి కావడం ఇంకో ట్విస్ట్. ఇలా ఆసక్తికర మలుపులతో ఉత్కంఠ రేకెత్తించేలా సాగుతుంది ఏడు ఎపిసోడ్ల ‘రెక్కీ’. మున్సిపల్ ఛైర్మన్ పాత్రలో తమిళ నటుడు ఆడుగళం నరేన్, అతడి కొడుకు క్యారెక్టర్లో శివబాలాజీ నటించారు. క్యారెక్టర్ నటుడు సమ్మెట గాంధీ.. హత్యకు పథకం రచించే పాత్రలో అదరగొట్టేశాడు.

ఇంకా శ్రీరామ్, ధన్య బాలకృష్ణన్, జీవా, శరణ్య ప్రదీప్ లాంటి పేరున్న తారాగణం ఈ సిరీస్‌లో నటించింది. కొత్త దర్శకుడు పోలూరు కృష్ణ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండే కథాకథనాలతో ఈ సిరీస్‌ను తీర్చిదిద్దాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంటుందనడంలో సందేహం లేదు. మన నేటివిటీతో పకడ్బందీ క్రైమ్ సిరీస్ చూడాలనుకునేవాళ్లకు ‘రెక్కీ’ మంచి ఛాయిస్.