డిజాస్టర్ నష్టాలకు డిజిటల్ మందు

ఈ మధ్యకాలంలో పెద్ద హీరో సినిమా డిజాస్టర్ అయితే దాని నష్టం ఊహకందని స్థాయిలో ఉంటోంది, ఓ ఇరవై ఏళ్ళ క్రితం టెక్నాలజీ ఈ స్థాయిలో లేనప్పుడు చిరంజీవి బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల చిత్రాలు ఫ్లాప్ అయినా సరే అభిమానంతోనో టైం పాస్ కు వేరే ఆప్షన్ లేదనే కారణంతోనో వాటిని థియేటర్లలో చూసేవాళ్ళు. దీని వల్ల చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చి నిర్మాతకు ఆర్థిక భారం తగ్గేది. వీడియో క్యాసెట్లు డివిడిల జమానాలోనూ వీటి తాకిడిని తట్టుకుని నిలబడ్డారు ప్రొడ్యూసర్లు. ఇప్పుడా పరిస్థితులు మచ్చుకు కూడా లేవు.

ఉదయం షోకి అస్సలు బాలేదనే టాక్ వస్తే చాలు సాయంత్రం ఆటకి జనం ఉండటం లేదు. బుకింగ్ కౌంటర్లు వెలవెలబోతున్నాయి. కట్ చేస్తే ఎగ్జిబిటర్లకు అద్దెలు సైతం వసూలు కాని దయనీయ పరిస్థితి నెలకొంటోంది. ఇదంతా డిజిటల్ ట్రెండ్ మహాత్యమే. ఆ మధ్య ఆచార్యకు జరిగిన పరాభవం గుర్తుందిగా. రాధే శ్యామ్ ఎంతగా ఇబ్బంది పడిందో ఫ్యాన్స్ మర్చిపోలేరు. ఖిలాడి పరిస్థితి మరీ ఘోరం. సర్కారు వారి పాటకు ముందు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ మూడో వారం నుంచే విపరీతమైన స్ట్రగుల్ చవిచూడాల్సి వచ్చింది.

తాజాగా బాలీవుడ్ లో మూడు వందల కోట్ల బడ్జెటని చెప్పుకుని వచ్చిన సామ్రాట్ పృథ్విరాజ్ పట్టుమని వంద కోట్లు తేలేక గుడ్లు తేలేసింది. దెబ్బకు అమెజాన్ ప్రైమ్ తో యష్ రాజ్ సంస్థ ముందు చేసుకున్న ఒప్పందాన్ని సవరించుకుని కేవలం నాలుగు వారాల్లోనే ఓటిటి రిలీజ్ చేసేలా ఒప్పుకుని దానికిగాను అదనపు ఆదాయం అందుకుంది. పైన చెప్పిన కొన్ని తెలుగు సినిమాలకూ ప్రైమ్ ఇదే తరహా స్పెషల్ ఆఫర్ ఇచ్చి సదరు నిర్మాతలకు ఊరట కలిగించింది. ఒకవేళ కరోనా రాకపోయి ఓటిటి విప్లవం ఈ స్థాయిలో లేకపోతే ఖచ్చితంగా ఈ తరహా పరిస్థితులు ఉండేవి కాదేమో. అప్పుడు శాటిలైట్ మీద ఆధారపడాల్సి వచ్చేది. అంతా కాల మహత్యం.