ముగ్గురు దిగ్గజాల ముచ్చటైన కలయిక

విక్రమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ఉబ్బితబ్బిబవుతున్న కమల్ హాసన్ తన ఆనందాన్ని మరోసారి హైదరాబాద్ లో జరిగిన సక్సెస్ మీట్ లో పంచుకున్నారు. తెలుగులో ఊహించిన దానికన్నా పెద్ద హిట్టు కొట్టడంతో ఆయన మొహంలో ఆ కళ స్పష్టంగా కనిపిస్తోంది.

మొదటి వారం పూర్తి కాకుండానే బ్రేక్ ఈవెన్ దాటేయడం, లాభాల్లోకి అడుగుపెట్టేయడం అది కూడా ఒక డబ్బింగ్ మూవీకి ఈ మధ్య కాలంలో జరగలేదు. అందుకే విక్రమ్ చాలా స్పెషల్ గా నిలుస్తోంది. దీని పుణ్యమాని అభిమానులకు కొన్ని అరుదైన క్షణాలు దొరుకుతున్నాయి.

నిన్న ఆ వేడుక ముగిసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కమల్ హాసన్ ని స్వాగతించి చిరు సత్కారంతో తన చిరకాల మిత్రుడితో విక్రమ్ విజయాన్ని పంచుకున్నారు. అంతే కాదు అక్కడ సల్మాన్ ఖాన్ కూడా రావడంతో ఆ పిక్స్ ని చూస్తున్న ముగ్గురు హీరోల ఫ్యాన్ ఫీలింగ్స్ గురించి చెప్పేదేముంటుంది.

కభీ ఈద్ కభీ దివాలి షూటింగ్ కోసం సిటీలోనే ఉన్న సల్మాన్ ఖాన్ కు ఆతిధ్యం మెగా ఫ్యామిలీ నుంచే వెళ్తోంది. అందుకే ప్రత్యేక ఆహ్వానం మీద ఆయన కూడా ఈ స్పెషల్ మూమెంట్స్ లో భాగం కావడం విశేషం.

దీనికంతా అసలైన కారకుడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా వీళ్ళతో ఉన్నాడు. మొత్తానికి విక్రమ్ అంచనాలకు మించి పెర్ఫార్మ్ చేయడంతో కమల్ ఫుల్ ఖుషి. ఇండియన్ 2కి విక్రమ్ రిజల్ట్ ఎంత పెద్ద ప్లస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా దాటేసిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ యుఎస్ లోనూ 2 మిలియన్ మార్క్ ని అవలీలగా అందుకుంది. ఫైనల్ రన్ అయ్యేలోపు తమిళనాడులో టాప్ 3లో నిలవడం ఖాయమే. తెలుగులోనూ లోకనాయకుడి బెస్ట్ ఫిగర్స్ నమోదు చేయనుంది.,