సీనయ్య మిస్ – కొత్తది ఫిక్స్

స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ హీరోగా ఆ మధ్య ‘సీనయ్య’ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. తన బేనర్ కి ‘దిల్’ తో మొదటి సక్సెస్ ఇచ్చిన వినాయక్ ని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు ఆ సినిమాను నిర్మించాలనుకున్నాడు. ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా చేశారు. కానీ అనుకోని విధంగా ఆ సినిమా క్యాన్సెల్ అయ్యింది. ఆ సినిమా దర్శకుడు నరసింహ రావు ఇచ్చిన ఫైనల్ నెరేషన్ నచ్చకపోవడంతో సెట్స్ పైకి వెళ్ళకముందే సినిమా ఆగిపోయింది. ఇక వినాయక్ యాక్టింగ్ కెరీర్ కి మొదటి సినిమానే బ్రేక్ వేసింది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో వినాయక్ దర్శకుడిగా ఛత్రపతి హిందీ రీమేక్ మొదలు పెట్టి బిజీ అయిపోయాడు.

అయితే ఇప్పుడు వినాయక్ హీరోగా కొత్త సినిమా ఒకటి ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. తాజాగా వినాయక్ కి ఓ కొత్త దర్శకుడు ఇంట్రెస్టింగ్ కథ చెప్పాడట. వినాయక్ కి కథ బాగా నచ్చడంతో ఆ దర్శకుడిని వర్క్ స్టార్ట్ చేయమని చెప్పేశాడట. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి ఎలాంటి డీటెయిల్స్ లేవు కానీ ప్రాజెక్ట్ మాత్రం లాక్ అయిందని అంటున్నారు. అన్ని కుదిరితే దిల్ రాజునే ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ కి సంబంధించి ఫైనల్ షెడ్యుల్ మిగిలింది. ఆ సినిమా షూట్ కంప్లీట్ చేసిన వెంటనే తను హీరోగా తెరకెక్కనున్న సినిమాను మొదలు పెట్టనున్నాడట వినాయక్.

ఇక తెలుగులో నటులుగా మారి సక్సెసయిన దర్శకులు కొందరున్నారు. దాసరి , కే విశ్వనాధ్ వంటి వారు నటులుగా రాణించి మంచి పాత్రలను పోషించారు. మరి వినాయక్ నటుడిగా ఎలాంటి విజయం అందుకుంటాడో వేచి చూడాలి.