శభాష్ నాయుడు కూడా బయటికి..?

లోకనాయకుడు కమల్ హాసన్ తన కెరీర్లో ఊహించని విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. కెరీర్లో ఈ దశలో ఆయన ‘విక్రమ్’ లాంటి బ్లాక్‌బస్టర్ కొడతారని ఎవ్వరూ ఊహించలేదు. అసలు కమల్ కెరీర్ ఆల్రెడీ ముగిసిందనే అభిప్రాయానికి వచ్చేశారు అభిమానులు కూడా. కొన్నేళ్ల పాటు సినిమాలే చేయక.. గ్యాప్ తర్వాత చేసిన ‘ఇండియన్-2’ మధ్యలోనే ఆగిపోయాక ఆయన మీద పూర్తిగా ఆశలు వదులుకున్నారు. కానీ కమల్.. ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో జట్టు కట్టి ‘విక్రమ్’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమా ఆయన కెరీర్‌కు ఎక్కడలేని ఊపునిచ్చింది. ఈ ఊపులో కమల్ తన పెండింగ్ ప్రాజెక్టులను బయటికి తీసే ప్రయత్నంలో పడ్డాడు. ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తయిన ‘ఇండియన్-2’ను తిరిగి పట్టాలెక్కించడానికి కమల్ చూస్తున్నాడు. నిర్మాతలైన లైకా ప్రొడక్షన్ అధినేతలు, దర్శకుడైన శంకర్‌లతో సంధి కుదిర్చి ఈ ఏడాదే ఈ సినిమాను పున:ప్రారంభించాలని కమల్ ఫిక్సయ్యాడు.

దీంతో పాటుగా మరో పెండింగ్ ప్రాజెక్టును కూడా కమల్ తిరిగి మొదలుపెట్టనున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఆ చిత్రమే.. శభాష్ నాయుుడు. ‘దశావతారం’ చిత్రంలో పోలీస్ అధికారిగా శభాష్ నాయుడు చేసిన సందడి గురించి తెలిసిందే. ఆ సినిమాలో కమల్ పది పాత్రలు చేస్తే అన్నింట్లోకి అదే హైలైట్ అయింది. ఈ పాత్రనే లీడ్‌గా మార్చి ‘శభాష్ నాయుడు’ పేరుతో సినిమా తీయాలని కమల్ సంకల్పించాడు అప్పట్లో. శ్రుతి హాసన్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లారు. యుఎస్‌లో ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది.

కానీ తర్వాత ఏం జరిగిందో ఏమో ఈ సినిమా అర్ధంతరంగా ఆగిపోయింది. మళ్లీ దాని ఊసే లేదు. కమల్ ఇలా మధ్యలో వదిలేసిన సినిమాల జాబితా పెద్దదే. మరుదనాయగం, మర్మయోగి.. ఇలా మెగా ప్రాజెక్టులు కొన్ని బడ్జెట్, ఇతర సమస్యలతో ముందుకు కదల్లేదు. ఐతే మిగతా సినిమాల సంగతేమో కానీ.. శభాష్ నాయుడును మాత్రం కమల్ పున:ప్రారంభించబోతున్నట్లు సమాచారం. దీని బడ్జెట్ తక్కువే కావడం, స్క్రిప్టు సిద్ధంగా ఉండడంతో వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించి, పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తేవాలని కమల్ భావిస్తున్నట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.