పాదఘట్టంలో కండల వీరుడు

ఆచార్య సినిమా చూసినవాళ్లకు చిరంజీవి చరణ్ లు గుర్తుంటారో లేదో కానీ ధర్మస్థలి పాదఘట్టం పదాలు మాత్రం పీడకలలా వెంటాడుతూనే ఉంటాయి. డైలాగుల కన్నా ఎక్కువ ఈ రెండు మాటలే చెవుల్లో రక్తం వచ్చేలా అన్ని పాత్రలతో చెప్పించారంటే అతిశయోక్తి కాదు. అమెజాన్ ప్రైమ్ లో వచ్చాక ఈ పాయింట్ మీద సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వచ్చాయి. అయితే ఈ షూటింగ్ కోసమని సెట్ వేసిన గుడి ఇప్పటిదాకా అలాగే ఉంచేశారు. ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని కోకాపేటలో అదలాగే ఉంది.

తాజాగా దీన్ని సల్మాన్ ఖాన్ ఉపయోగించుకోబోతున్నట్టు తెలిసింది. ఉన్న సెట్ కే కొన్ని మార్పులు చేసి దాన్ని గ్రామంగా మారుస్తారట. కభీ ఈద్ కభీ దీవాలి ప్రధానమైన షెడ్యూల్ ఇందులో చిత్రీకరించబోతున్నట్టు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఆమెకు అన్నయ్యగా విక్టరీ వెంకటేష్ నటించబోతున్నారని ఆల్రెడీ లీక్ వచ్చింది కానీ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నిప్పు లేనిదే పొగ రాదు కాబట్టి ఇది నిజమయ్యే అవకాశాలే ఎక్కువ. త్వరలో అనౌన్స్ మెంట్ రావొచ్చు.

గాడ్ ఫాదర్ షూట్ జరుగుతున్న సమయంలో చిరు సల్మాన్ ల మధ్య కభీ ఈద్ కభీ దీవాలికి సంబందించిన ప్రస్తావన వచ్చినప్పుడు మెగాస్టార్ ధర్మస్థలి సెట్ గురించి చెప్పారట. వెంటనే దాన్ని చూసిన కండల వీరుడికి, దర్శకుడు ఫర్హాద్ సాంజికి నచ్చేయడంతో మార్పులకు రెడీ అయ్యారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నాన్ స్టాప్ గా పూర్తి చేయబోతున్నారు. వెంకీ, పూజా హెగ్డేలు ఉంటారు కాబట్టి తెలుగులోనూ దీనికి మంచి మార్కెట్ దక్కుతుంది.