కన్నీళ్లు పెట్టించేసిన రాజశేఖర్ కూతురు


సినీ పరిశ్రమలో పేరున్న కుటుంబాల నుంచి హీరోలు రావడం మామూలే కానీ.. హీరోయిన్లు రావడం అరుదు. ఇలా వచ్చి సక్సెస్ అయిన వాళ్లు కూడా చాలా అరుదుగా కనిపిస్తారు. నందమూరి, దగ్గుబాటి కుటుంబాల నుంచి ఒక్కరు కూడా నటనలోకి అడుగు పెట్టకపోగా.. అక్కినేని ఫ్యామిలీ నుంచి సుప్రియ వచ్చినా ఒక్క సినిమాతో మాయమైపోయింది. మంచు కుటుంబం నుంచి వచ్చిన లక్ష్మీప్రసన్న కూడా సక్సెస్ కాలేదు. మెగా ఫ్యామిలీ అమ్మాయి కొణిదెల నిహారిక కూడా మూణ్నాలుగు సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుని వెనక్కి వెళ్లిపోయింది.

ఐతే రాజశేఖర్ మాత్రం తన ఇద్దరు కూతుళ్లు శివాని, శివాత్మికలను సినిమాల్లోకి తీసుకొచ్చాడు. వాళ్లలో ఇద్దరూ ఎంత కష్టపడుతున్నా ఇప్పటిదాకా అయితే అదృష్టం కలిసి రాలేదు. శివాని తొలి చిత్రంగా మొదలైన ‘2 స్టేట్స్’ రీమేక్ మధ్యలోనే ఆగిపోగా.. తర్వాత చేసిన ‘అద్భుతం’, ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ ఓటీటీల్లో నామమాత్రంగా రిలీజయ్యాయి. ఇప్పుడు ఆమె తన తండ్రి రాజశేఖర్‌తో కలిసి ‘శేఖర్’ సినిమాలో నటించింది.

ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తన కెరీర్లో ఒడుదొడుకులు, కొవిడ్ బారిన పడి తన తండ్రి మృత్యు అంచుల దాకా వెళ్లడం గురించి శివాని చాలా ఎమోషనల్ అయింది. తనను అందరూ నష్టజాతకురాలు అనడం గురించి ఆమె ఈ వేదిక మీద ప్రస్తావించడడం గమనార్హం.

తాను నటిని అవుదామని ప్రయత్నం మొదలుపెట్టాక ఆరేళ్లు అయినా తన తొలి సినిమా రిలీజ్ కాలేదని.. దీంతో తన జాతకంలో ఏదో దోషం ఉందని అందరూ అనడం మొదలుపెట్టారని, దోషం పోవడానికి పూజలేవైనా చేయించాలని కూడా సూచించారని.. ఐతే ముందు తాను ఇవేమీ పట్టించుకోలేదని.. కానీ గత ఏడాది తనకు జలుబు రావడం.. అది మూడు రోజుల్లో తగ్గిపోయినా.. తన తండ్రికి తన ద్వారా ఇన్ఫెక్ట్ అయి ఆసుపత్రి పాలవడం, ఆయన పరిస్థితి విషమించడంతో తొలిసారిగా నిజంగానే తాను నష్టజాతకురాలినేనేమో అని అన్న అనుమానం తనకు కలిగిందని శివాని చెప్పింది. డాక్టర్లు ఒక టైంలో ఆయన బతికే అవకాశాలు 50-50 అని చెప్పారని.. అప్పుడు తాను తన తండ్రి దగ్గరికి వెళ్లి.. దయచేసి మామూలు మనిషి కావాలని, మీకేమైనా అయితే నేను తట్టుకోలేనని. నా వల్ల ఇదంతా జరిగిందన్న నిందను మోయలేనని చెప్పానని.. దేవుడి దయ వల్ల ఆయన కోలుకున్నారని శివాని అంది.

కొవిడ్ వల్ల రాజశేఖర్ 12 కిలోల బరువు తగ్గారని, ఆయన ఊపిరితిత్తులు 75 శాతం పాడయ్యాయని.. అయినా సరే ఆయన మళ్లీ కష్టపడి వర్కవుట్లు చేసి, బరువు పెరిగి ‘శేఖర్’ సినిమా చేశారని.. అలాగే ఇందులో ప్రధాన పాత్ర కోసం సిగరెట్లు కూడా తాగారని, సినిమా కోసం ఆయన కమిట్మెంట్ అలాంటిదని శివాని ఉద్వేగంగా చెప్పింది. ఈ సందర్భంగా ‘శేఖర్’ సినిమాలో తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చే పాటను పాడి తన కుటుంబ సభ్యులతో పాటు అందరి కళ్లలోనూ నీళ్లు తిరిగేలా చేసింది శివాని.