రౌడీ బాబు.. ఏమిటీ దూకుడు?


కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమల్లో నెలల తరబడి స్తబ్దత నెలకొంది. హీరోల దగ్గర్నుంచి.. జూనియర్ ఆర్టిస్టుల వరకు అందరూ నెలలు నెలలు పని లేక ఖాళీగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి విరామం లేకుండా సినిమాలు చేస్తూ వచ్చిన వాళ్లందరికీ కెరీర్లో గ్యాప్ తప్పలేదు. దాని వల్ల ఆర్థికంగా నష్టం జరగడమే కాక.. చాలామంది కెరీర్లపై ప్రతికూల ప్రభావం పడింది. ఐతే వైరస్ ప్రభావం బాగా తగ్గిపోవడంతో ఇప్పుడు నష్ట నివారణ చర్యల్లో పడ్డారంతా. హీరోలు మునుపటితో పోలిస్తే మరింత వేగంగా సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నారు.

అగ్ర హీరోలందరూ రెండు మూడేళ్ల వరకు అస్సలు ఖాళీ లేని విధంగా ప్రాజెక్టులు ఓకే చేశారు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాంతో సమాంతరంగా ఇంకోటి సినిమాలు పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు. మాస్ రాజా రవితేజ లాంటి వాళ్ల ప్లానింగ్ అయితే మామూలుగా లేదు. మామూలుగానే రవితేజ చాలా స్పీడు. ఇప్పుడు వేగం మరింత పెంచాడు.

ఇప్పుడు విజయ్ దేవరకొండ సైతం తన ప్లానింగ్‌తో ఆశ్చర్యపరుస్తున్నాడు. టాలీవుడ్లో అత్యంత వేగంగా సినిమాలు తీసే స్టార్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్‌తో విజయ్ చేసిన ‘లైగర్’ ఎంత ఆలస్యం అయిందో తెలిసిందే. కరోనాకు తోడు వేరే కారణాలు కూడా తోడై ఈ చిత్రం బాగా లేటైంది. ఐతే దీని తాలూకు నష్టం పూడ్చడానికి విజయ్ పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నాడు. పూరి వల్ల జరిగిన ఆలస్యాన్ని ఇంకో సినిమాతో భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జేజీఎం’ (జనగణమన) ఆల్రెడీ పట్టాలెక్కేసింది. చకచకా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఇంతలోనే శివ నిర్వాణతో కొత్త సినిమాను హడావుడిగా మొదలుపెట్టేశాడు.

‘జనగణమన’ అయ్యాకే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందనుకుంటే.. సమాంతరంగా రెండు చిత్రాల్లోనూ పాల్గొనడానికి విజయ్ నిర్ణయించుకున్నాడు. రెంటికీ ఒకే లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. రెండూ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాలే. ఇవి రెండూ ఈ ఏడాదే పూర్తి కాబోతున్నాయి. శివ నిర్వాణతో చేస్తున్న ‘ఖుషి’ సినిమా రిలీజ్ కూడా ఈ ఏడాదే కావడం విశేషం. ఆగస్టు 25న ‘లైగర్’ రిలీజవుతుంటే.. ‘ఖుషి’ డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘జనగణమన’ను వచ్చే వేసవికి షెడ్యూల్ చేశారు. అంటే పది నెలల వ్యవధిలో మూడు పాన్ ఇండియా సినిమాలతో విజయ్ ప్రేక్షకుల తీర్పు కోరబోతున్నాడన్నమాట.